
ఐజ్వాల్ : మిజోరాం రైల్వే బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. ఇప్పటివరకు 22 మంది నిర్మాణ కార్మికుల మృతదేహాలను వెలికితీసినట్లు రైల్వే, పోలీస్ అధికారులు తెలిపారు. కూలిపోయిన ఉక్కు నిర్మాణం కింద ఉన్న నాలుగు మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.
రాజధాని ఐజ్వాల్కు 21 కి.మీ దూరంలో ఉన్న సైరంగ్ ప్రాంతంలో బుధవారం ఉదయం నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో 17 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 30 నుండి 40 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. భైరవి-సైరంగ్ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులోని 13 వంతెనలలో ఇది ఒకటి. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించినట్లు అధికారులు తెలిపారు.