Jun 01,2023 22:00
  • మేలో రూ.1.57 లక్షల కోట్ల రాబడి

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అంచనాలు మించి ప్రజల నుంచి పన్ను వసూళ్లను రాబడుతోంది. ప్రస్తుత ఏడాది మేలో రూ.1,57,090 కోట్ల వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూలు చేసింది. గతేడాది ఇదే మాసంలో రూ.1,40,885 కోట్ల వసూళ్లతో పోల్చితో 12 శాతం పెరుగుదల చోటు చేసుకుందని గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన నెల మొత్తం జిఎస్‌టిలో సిజిఎస్‌టి కింద రూ రూ.28,411 కోట్లు, ఎస్‌జిఎస్‌టి కింద రూ.35,828 కోట్లు, ఐజిఎస్‌టి కింద రూ.81,363 కోట్లు చొప్పున వసూళ్లయ్యాయని వెల్లడించింది. సెస్సుల రూపంలో మరో రూ.11,489 కోట్ల రాబడి చోటు చేసుకుంది. గడిచిన మే మాసంలో తెలుగు రాష్ట్రాల్లోనూ పన్ను వసూళ్లు పెరిగాయి. గతేడాది మేలో తెలంగాణ నుంచి రూ.3982 కోట్ల జిఎస్‌టి వసూలు కాగా.. గడిచిన మేలో 13 శాతం పెరిగి రూ.4507 కోట్లుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 11 శాతం పెరిగి రూ.3373 కోట్ల మేర జిఎస్‌టి వసూళ్లయ్యింది. 2022 మేలో రూ.3047 కోట్ల పన్ను రాబడి చోటు చేసుకుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో 2023 ఏప్రిల్‌లో దేశంలో రికార్డ్‌ స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల జిఎస్‌టి వసూళ్లు జరిగాయి.