Apr 22,2023 20:45
  • సాధారణ ఉద్యోగితో పోల్చితే 800 రెట్లు అధికం
  • మరోవైపు సిబ్బందికి ఉద్వాసన

న్యూఢిల్లీ : ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌లో పొదుపు చర్యల్లో భాగంగా ఓ వైపు వేలాది ఉద్యోగులను ఇంటికి పంపిస్తుండగా.. ఆ సంస్థ బాస్‌కు మాత్రం కళ్లు చెదిరిపోయే పారితోషకాన్ని అందిస్తోంది. గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ సిఇఒ సుందర్‌ పిచారు ఏకంగా 226 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 1,850 కోట్లు) పారితోషికం తీసుకున్నారని రిపోర్టులు వస్తున్నాయి. ఇది కంపెనీలో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే 800 రెట్లు ఎక్కువగా కావడం విశేషం. ఈ పారితోషికంలో 218 మిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్‌ అవార్డులను అందుకున్నారని ఆల్ఫాబెట్‌ శుక్రవారం రెగ్యులేటరీకి వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో 12వేల మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు ప్రకటించింది. మాంద్యం భయాల నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఇది ఆ కంపెనీ మొత్తం సిబ్బందిలో ఆరు శాతానికి సమానం. మరోవైపు గూగుల్‌ బాస్‌కు భారీగా ముడుతున్నప్పటికీ.. క్రింది స్థాయి ఉద్యోగులకు మాత్రం ప్రోత్సాహకాల చెల్లింపుల్లో మొండి చెయ్యి చూపిస్తున్నారు. ఉన్న సిబ్బంది బోనస్‌ల్లోనూ కోతలు విధించనున్నట్లు జనవరిలో పేర్కొంది. వ్యయాల నియంత్రణ కేవలం ఉద్యోగుల తొలగింపులతోనే ఆగిపోదని పిచారు అప్పట్లో తెలిపారు. బాధ్యతాయుత నాయకత్వ హోదాల్లో పని చేస్తున్న ఉద్యోగుల బోనస్‌ల్లోనూ కోతలు పెట్టనున్నామన్నారు. ఉద్యోగులందరికీ ఈ ఏడాది బోనస్‌లు తగ్గుతాయని ఆయన స్పష్టం చేశారు.