Jun 10,2023 21:23

మనీ ఎక్స్చేంజీ పరిశ్రమ డిమాండ్‌
హైదరాబాద్‌ : భారతీయులు విదేశాల్లో చేసే లావాదేవీలకు ఒకే స్థాయి అవకాశాలు, నిబంధనలు ఉండాలని మనీ ఎక్స్చేంజీ పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. ఉపయోగించిన మార్గంతో సంబంధం లేకుండా రూ.7 లక్షల వరకు చేసే లావాదేవీలకు ఒకే రకమైన అవకాశాలు కల్పించాలని ఆల్‌ ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ ఆథరైజ్డ్‌ మనీ ఛేంజర్స్‌ అండ్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్స్‌ జనరల్‌ సెక్రటరీ భాస్కర రావు పి కోరారు. విదేశీ నగదు మార్పిడిలో డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌లతో సమానత్వాన్ని కోరుతున్నామన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ గత నెలలో రూపొందించిన నిబంధనల ప్రకారం డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌లను ఉపయోగించి విదేశాలలో నిర్వహించే లావాదేవీలకు టిసిఎస్‌ నుండి ఒక ఆర్థిక సంవత్సరానికి అతి తక్కువ మొత్తం రూ.7 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. అయితే.. విదేశీ కరెన్సీ నగదు, బ్యాంకుల ద్వారా వైర్‌ బదిలీలు, ప్రీ-పెయిడ్‌ ఫారెక్స్‌ కార్డ్‌లు ఇతర అంతర్జాతీయ చెల్లింపు అవకాశాలతో కూడిన చిన్న విలువ లావాదేవీలకు సంబంధించి మరీ ముఖ్యముగా విరామం లేదా ఉపాధి కోసం విదేశీ పర్యటనల సమయంలో వ్యక్తులు విస్తృతంగా ఉపయోగించే మొత్తానికి సంబంధించిన నిర్దిష్ట వివరణ ఇవ్వకపోవడంతో పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విదేశాల్లో క్రెడిట్‌ కార్డు లావాదేవీలను నిర్వహించినప్పుడు వర్తించే టిసిఎస్‌ నిబంధనలపై త్వరలోనే పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రామన్‌ చోప్రా తెలిపారు. జులై 1 నుంచి విదేశాల్లో క్రెడిట్‌ కార్డు లావాదేవీలు చేసినప్పుడు 20 శాతం టిసిఎస్‌ విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై విమర్శలు రావడంతో రూ.7 లక్షల వరకూ మినహాయింపును ఇచ్చింది. అయినప్పటికీ అనేక అనుమానాలున్న నేపథ్యంలో మరింత స్పష్టత ఇస్తామని ఆర్థిక శాఖ పేర్కొంది.