Jun 29,2022 06:40

  ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఎఐఐఇఎ) 1951 జులై 1న ఆవిర్భవించింది. ఇన్సూరెన్స్‌ రంగ జాతీయీకరణ కోరుతూ మొదటి సమావేశంలోనే తీర్మానాన్ని ఆమోదించి...ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలన్నింటిని కలిపి జాతీయీకరణ చేసి...'లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా'గా ఏర్పాటు చేసేలా పోరాడిన చరిత్ర 'ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌'ది.
         'ప్రజల సొమ్ము ప్రజల శ్రేయస్సు కొరకే' అనే ఇన్సూరెన్స్‌ జాతీయీకరణ లక్ష్యాల సాధన కోసం ప్రచార, పోరాట కార్యాచరణతో నిరంతరం సైద్ధాంతిక నిబద్ధతతో ఎఐఐఇఎ పయనించింది. ఎమర్జెన్సీ కాలంలోనే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు గొంతెత్తి నినదించింది. ఎల్‌ఐసి ని స్వతంత్ర ప్రతిపత్తిగల కార్పొరేషన్‌గా విభజించాలన్న నాటి ప్రభుత్వ యత్నాలను నిలువరించింది. మల్హోత్రా కమిటీ, బీమా రంగ సంస్కరణలు, ప్రైవేటీకరణ వంటి అంశాలకు వ్యతిరేకంగా కోటి యాభై లక్షల సంతకాల సేకరణతో విస్తృత ప్రజాభిప్రాయాన్ని 'పీపుల్స్‌ పిటిషన్‌' పేరుతో పార్లమెంట్‌కు సమర్పించింది. ఎల్‌ఐసి, ఇన్సూరెన్స్‌ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల పార్లమెంట్‌ సభ్యులను కలిసి వివరించి పార్లమెంట్‌లో అనేక సార్లు జాతీయ ఇన్సూరెన్స్‌ రంగ పరిరక్షణ కోసం చర్చ జరిగేలా నినదించింది. ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలపై జాతీయ కార్మిక సంఘాలతో కలిసి సమ్మెలలో పాల్గొని సమర శంఖం పూరించిన వైనంతో పాటుగా వేతన సవరణ, పెన్షన్‌ సాధనతో సహా అనేక సౌకర్యాలు, సదుపాయాలను సాధించి  మెజారిటీ ఉద్యోగుల మన్ననలు పొందిన ట్రేడ్‌ యూనియన్‌ ఎఐఐఇఎ.
      ఎల్‌ఐసి మరియు జాతీయ సాధారణ బీమా పరిశ్రమల వ్యవస్థాగత లక్ష్యాల పరిరక్షణ, విశాల ఉద్యోగుల ఐక్యత, ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల పోటీని ఎదుర్కొని సంస్థను మార్కెట్‌ లీడర్‌గా నిలపడం... ప్రైవేటీకరణ, డిజిన్వెస్ట్‌మెంట్‌ విధాన ప్రభావం నుంచి జాతీయ బీమా రంగాన్ని కాపాడుకోవడం, ఎల్‌ఐసి-ఐపీఓ అనంతర పరిణామాలపై పట్టాదారులకు భరోసా కల్పించడం వంటి అనేక బహుముఖ సవాళ్ళను ఎఐఐఇఎ ఎదుర్కొంటోంది. నేటి సవాళ్ళు గతంలో ఎదుర్కొన్న వాటి కంటే పెద్దవి.
     భారత దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు ఎల్‌ఐసి ఒక ప్రధానమైన ఆర్థిక సంస్థగా భావించింది గనకే ఎల్‌ఐసి పబ్లిక్‌ ఇష్యూను ఎఐఐఇఎ వ్యతిరేకించింది. మూడు దశాబ్దాలుగా ఇన్సూరెన్స్‌ ప్రైవేటీకరణ, డిజిన్వెస్ట్‌మెంట్‌కు వ్యతిరేకంగా ఎఐఐఇఎ చేసిన మహోన్నత ప్రచార ఉద్యమం ఫలితంగానే వివిధ రాజకీయ పార్టీలు, ట్రేడ్‌ యూనియన్లు, పౌర సమాజం ఎల్‌ఐసిని స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేయవద్దని ప్రభుత్వానికి హితవు పలికింది. కానీ ప్రభుత్వం వీటన్నింటినీ తోసిపుచ్చి తాను నిర్ణయించిన డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని చేరేందుకు, బడ్జెట్‌ లోటును పూడ్చుకునేందుకు ఎల్‌ఐసి-ఐపీఓ ప్రక్రియను కొనసాగించింది.
      ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో మార్కెట్‌ స్థితిగతులు ప్రతికూలంగా వున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం హెచ్చు స్థాయిలో వుంది. ఇష్యూకు విదేశీ మదుపరులు దూరంగా ఉండే పరిస్థితి. అయినప్పటికీ 3.5 శాతం మేరకు ఈక్విటీ షేర్లను డిజిన్వెస్ట్‌మెంట్‌ చేయాలన్న తన నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రక్రియలో ఎల్‌ఐసి ఎంబెడెడ్‌ విలువను అతి తక్కువగా చేసి చూపించడం గమనార్హం.
ప్రభుత్వం ఎల్‌ఐసి వాటాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి కేటాయింపు విధానాన్ని 2022 మే 12 నాటికి బహిర్గత పరిచింది. దీని ప్రకారం ప్రభుత్వంతో పాటుగా మొత్తం 4007528 వాటాదారులను ఎల్‌ఐసి కలిగి ఉంది. ప్రభుత్వ విచక్షణా రహిత కార్యాచరణ వలన ఎల్‌ఐసి షేర్లు, విలువ తగ్గి డిస్కౌంట్‌తో ట్రేడై మదుపరులను నిరుత్సాహపరిచింది. అయితే ఇది మొత్తం స్టాక్‌ మార్కెట్‌ ట్రెండ్‌లో భాగంగా జరిగిన పరిణామం. అయినప్పటికీ ఈ ప్రక్రియ ఎఐఐఇఎ పేర్కొన్నట్టుగానే ఎల్‌ఐసి ప్రతిష్టకు భంగం కలిగించింది.
       స్టాక్‌ మార్కెట్‌లో ఎల్‌ఐసి షేరు విలువ తీరుకు, వాస్తవ ఎల్‌ఐసి వ్యాపార పని తీరుకు అంతరం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలలోనూ ఎల్‌ఐసి తన మార్కెట్‌ ఆధిపత్యాన్ని కొనసాగించింది. మే నెల 2022 ముగింపు నాటికి ప్రీమియం ఆదాయంలో 99.63 శాతం వృద్ధి రేటును, పాలసీల సంఖ్యలో 73.49 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ఇదే సమయంలో ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలు 64.96 శాతం ప్రీమియం ఆదాయంలోనూ, 48.73 శాతం పాలసీల సంఖ్యలోనూ వృద్ధి రేటు నమోదు చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి ఇప్పటికే 25 లక్షల నూతన పాలసీలను అమ్మింది. ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలతో పోల్చినపుడు ఎల్‌ఐసి పని తీరు స్థాయి ఎక్కువగానూ, నిర్వాహణ ఖర్చు చాలా తక్కువగానూ ఉంది. మరి ఎందుకు ఎల్‌ఐసి అద్భుత పని తీరును మార్కెట్‌ డిస్కౌంట్‌ చేస్తోంది అనేదే ప్రశ్న? ఎల్‌ఐసి ప్రభుత్వ అజమాయిషీలో కొనసాగడం, మార్కెట్‌ ఎప్పుడూ ప్రభుత్వ రంగ సంస్థల విలువను డిస్కౌంట్‌ చేయడమే దీనికి కారణం. ఎల్‌ఐసి నిర్మాణ శైలి ఎప్పుడూ షేర్‌ విలువ లాభాల కన్నా, సమాజ శ్రేయస్సుకు సంబంధించిన అంశానికే ప్రాధాన్యత ఇస్తుంది.
        ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగించటం, ఎల్‌ఐసిలో మరింతగా వాటాల ఉపసంహరణ కాకుండా కాపాడుకోవడం, పట్టాదారుల ప్రయోజనాలను ఎల్‌ఐసి సంరక్షిస్తుందని భరోసా ఇవ్వడం, వారి ప్రయోజనాల పరిరక్షణకు ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించడం ఎఐఐఇఎ వ్యవస్థాపక దినోత్సవ లక్ష్యం.
       ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఐపిఓను వ్యతిరేకించినప్పటికీ చిన్న ఇన్వెస్టర్లకు, ఎల్‌ఐసి మార్కెట్‌ లీడర్‌గా పెద్దఎత్తున వృద్ధి సాధించే అవకాశాలు కొనసాగుతాయని, వారి పెట్టుబడి వృద్ధి కోసం సహనంగా వేచి ఉండాలని అవగాహన కల్పించాలి. కేవలం వాటాదారుల లాభాలకే పరిమితం కాకుండా విశాల సమాజ ప్రయోజనాల కోసం ఎల్‌ఐసి పని చేసేలా ప్రచారోద్యమాన్ని కొనసాగించాలి. పరిశ్రమలో ఐక్యత కోసం మాత్రమే పరిమితం కాక, విశాల కార్మిక వర్గ ఐక్యత నిర్మాణం కోసం పనిచేయాలి. పాలక వర్గాల మతతత్వ, భాషాతత్వ పోకడలను... కార్మిక చట్టాల మార్పుల వంటి విధానాలను తిప్పికొట్టేందుకు కృషి చేయాలి. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ లక్ష్య సాధనకు పునరంకితమవ్వడం దేశ వ్యాప్త ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల కర్తవ్యం.
                                     జి. కిషోర్‌ కుమార్‌                                  

                                                  జి. కిషోర్‌ కుమార్‌

        / వ్యాసకర్త : జాయింట్‌ సెక్రటరీ, ఎస్‌సిజడ్‌ఐఇఎఫ్‌, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎల్‌ఐసి ఉద్యోగ సంఘం /
                                                       సెల్‌: 9440905501