- ప్రముఖ బాలల కథా రచయిత కృష్ణ శ్రీ
ప్రజాశక్తి - పెద్దాపురం : చిన్ననాటి నుండి బాలలతో కథలు చదివించడం,కథలు చెప్పడం ద్వారా వారిలో సృజనాత్మకతను పెంపొందించవచ్చని ప్రముఖ బాలల కథా రచయిత కృష్ణ శ్రీ అన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీ నుండి జూన్ 10 వ తేదీ వరకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు లో బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బాలలకు కథలు ఎలా చదవాలో, కథలు ఎలా చెప్పాలో, కథలు ఎలా రాయాలో అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన బాలలకు తెలిసిన కథల గురించి వారి నోటి ద్వారా విని ఆ కథలపై ముచ్చటించారు. కథలను వారసత్వంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం ఎస్ సి మూర్తి మ్యాథ్స్, దుంగల పూజితాసూర్యశ్రీ కరాటేలో, శ్యామ్ కుమార్ డ్రాయింగ్ లో బాలలకు శిక్షణ ఇచ్చారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ బుద్దా శ్రీనివాస్ సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన కల్పించారు. ఈ క్యాంపులో రొంగల అరుణ్ కుమార్, జ్యోత్స్న, అమృత, నమ్రత, కూనిరెడ్డి రవికుమార్,డి కృష్ణ,సూరజ్ తదితరులు పాల్గొన్నారు.










