- చేయూత డాక్టర్ ఎమ్. రవికుమార్
ప్రజాశక్తి-కాకినాడ : ప్రతి విద్యార్థీ సేవా దృక్పథం కలిగి ఉండాలని చేయూత ఛారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎమ్. రవి కుమార్ అన్నారు. స్థానిక జగన్నాధపురం ఎమ్.ఎస్.ఎన్ చారిటిస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల నందు వి.బి.వి ఆర్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్యర్యం లో నిర్వహిస్తున్న వేసవి వినోదం 6వ రోజు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన చేయూత ఛారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎమ్.రవి కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థీ సేవా దృక్పథం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు రక్తదానం, అవయవ దానంపై అవగాహన కలిగి ఉండలన్నారు. తలసీమియా బాధిత పిల్లలకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు బాగాచదువుకుని ఉన్నత స్ధానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
- కధలతో విద్యార్థులలో విశ్లేషణ నైపుణ్యం, భాషపై పట్టు సాధ్యం : కృష్ణశ్రీ
కధలు మనిషిని కదిలిస్తాయి. కార్యాచరణకు పురిగొల్పుతాయని కధలమాస్టారు కృష్ణశ్రీ అన్నారు. ఎ. గోపాలకృష్ణ (కృష్ణశ్రీ ) పిల్లలకు కధల గురించి వివరించారు. కధల ప్రయోజనం, కధలు చదవడం, సమీక్షించడం, సొంతంగా రాయడం, ముగింపు చెప్పడం, కథను నాటకీకరణ చేసి ప్రదర్శించడం మొదలగు అంశాలపై కృష్ణశ్రీ తరగతిలో విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ప్రధానంగా పర్యావరణ పై కధలు చెప్పి, విద్యార్థులచే సమీక్షింప చేయడం అందరినీ అలరించింది. వేసవి వినోదం కార్యక్రమం కన్వీనర్ కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ చేయూత ఛారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎమ్. రవి కుమార్ సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ ను ఘనంగా సత్కరించారు.










