Aug 21,2022 17:15

భోపాల్‌ :   బాలివుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ నటించిన ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో యాడ్‌పై విచారణ చేపట్టాలని మహారాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా పోలీసులను ఆదేశించారు.  సోషల్‌మీడియాలో ప్రసారమవుతున్న ప్రకటన వీడియో మార్ఫింగ్‌ చేసినట్లు ఉందని మిశ్రా ఆదివారం మీడియాకు తెలిపారు.  దీంతో వీడియో వాస్తవికతను పరిశీలించి నివేదికను సమర్పించాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని ఉజ్జయినీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ను ఆదేశించినట్లు తెలిపారు. హృతిక్‌రోషన్‌ నటించిన జొమాటో యాడ్‌పై మహాకాళేశ్వర్‌ ఆలయ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భక్తులకు ప్రసాదంగా ఇచ్చే థాలిపై జొమాటో ప్రకటన రూపొందించి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని, వెంటనే ఆ యాడ్‌ను తొలగించాలని, హిందువులకు క్షమాపణలు చెప్పాలని ఆలయ పూజారులు మహేష్‌, ఆషిష్‌ డిమాండ్‌ చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిందిగా మహాకాళేశ్వర్‌ ఆలయ ట్రస్ట్‌ చైర్మన్‌, ఉజ్జయినీ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశామని వారు పేర్కొన్నారు.

ఈ యాడ్‌పై జొమాటో సంస్థ స్పందించింది. ఈ యాడ్‌పై వివరణనిస్తూ ట్విటర్‌లో ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆ వీడియోలో ఉజ్జయినీలో ఉంటే  థాలిని ఆర్డర్ చేస్తానని  హృతిక్‌రోషన్‌ పేర్కొంది  మహాకాల్‌ రెస్టారెంట్‌ నుండి  అని, మహాకాళేశ్వర్‌ ఆలయం నుండి  కాదని అన్నారు.  ఉజ్జయినీలోని మహాకాల్‌ రెస్టారెంట్‌ నుండి అధికశాతం మంది థాలిని ఆర్డర్‌చేస్తారని .. అది మెనూలో ఎక్కువమంది కోరుకునే జాబితాలో ఉందని పేర్కొంది. ఇటీవల దేశంలో ప్రజాదరణ కలిగిన  స్థానిక రెస్టారెంట్లు, అక్కడి టాప్‌ వంటకాలపై పాన్‌ ఇండియా కాంపెయిన్‌ను నిర్వహించామని, ఈ వీడియో అందులో భాగమని పేర్కొంది. మహాకాల్‌ రెస్టారెంట్‌ను మహాకాల్‌గా కూడా వ్యవహరిస్తారని తెలిపింది. ఉజ్జయినీ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ.. ఈయాడ్‌ ప్రచారాన్ని నిలిపివేస్తామని పేర్కొంది. ఎవరినైనా భాద పెట్టి ఉంటే క్షమించాలంటూ ఆ ప్రకటనలో పేర్కొంది.

 

;