న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 25 నెలల కనిష్టానికి పడిపోయింది. బియ్యం, గోధుమలు, కందిపప్పు వంటి పప్పుధాన్యాల రిటైల్ ధరలు అధికంగా పెరగడంతో గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం 4.25 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణ వివరాలను సోమవారం విడుదల చేసింది. మరోవైపు ఆహార ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టానికి చేరడంతో.. మొత్తంగా 2.91 శాతంగా నమోదైంది. గోధుమల ద్రవ్యోల్బణం మే నెలలో స్వల్పంగా తగ్గినప్పటికీ .. ఇతర ఉత్పత్తుల ధరలు అధికంగా పెరిగాయి. తయారైన బ్రెడ్ ద్రవ్యోల్బణం మే నెలలో 10.36శాతానికి తగ్గగా, గత నెలలో 11.34 శాతంగా ఉన్నాయి. రవ్వ ద్రవ్యోల్బణం 12.82 శాతం నుండి 11.15 శాతానికి తగ్గగా, మైదా 17.02 శాతం నుండి 14.36 శాతానికి తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఏప్రిల్లో వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ద్రవ్యోల్బణం 4.7 శాతంగా నమోదైంది.
ద్రవ్యోల్బణ వివరాలు విడుదల కావడానికి ముందురోజు ప్రభుత్వం వ్యాపారులు, టోకు వ్యాపారులు, రిటైలర్లు, ఇతర వ్యాపారులకు గోధుమలపై స్టాక్ పరిమితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని, వచ్చే ఏడాది మార్చి వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. గడిచిన 15 ఏళ్లలో ప్రభుత్వం స్టాక్ పరిమితి నిబంధన విధించడం ఇదే మొదటిసారని జాతీయ మీడియా పేర్కొంది.
రుతుపవనాల రాక ఆలస్యం కారణంగా రాబోయే నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం అధికమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆర్థికవేత్తలు హెచ్చరించారు. ఎల్నినో, రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఖరీఫ్ దిగుబడి, రబీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితినాయర్ తెలిపారు.










