Oct 12,2023 07:30

న్యూఢిల్లీ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీ మారింది. నవంబర్‌ 23న జరగాల్సిన పోలింగ్‌ తేదీని నవంబర్‌ 25కి మారుస్తూ బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 9న తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నవంబర్‌ 23 (గురువారం) జరగాల్సి ఉంది. ఇదేరోజు అక్కడ దేవ్‌ ఉథాని ఏకాదశి పండగ జరుపుకుంటారు. అలాగే ఇదే రోజున రాష్ట్రంలో 50వేల కంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఓటింగ్‌ శాతం తగ్గిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజస్థానీలు దేవ్‌ ఉథాని ఏకాదశి రోజున వివాహాలు నిర్వహించుకోవడాని ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్‌ తేదీని మార్చాలంటూ పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి ఇసికి విజ్ఞప్తులు వచ్చాయి. రవాణా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు ఓటర్లు పోలింగ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉండొచ్చని.. అందువల్ల పోలింగ్‌ తేదీ మార్చాలంటూ వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నట్లు ఇసి తెలిపింది.