Nov 21,2023 10:24

జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అభ్యర్థులకు మద్దతు, ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు, ప్రదర్శనలు జరిగాయి. ధోడ్‌లో జరిగిన భారీ 'విజయ ప్రతిజ్ఞ' బహిరంగ సభలో పార్టీ అభ్యర్థి పేమా రామ్‌కు మద్దతుగా వేలాది మంది తరలివచ్చిన ప్రజలు ''విజయం మనదే'' అని ప్రతిజ్ఞ పూనారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అమ్రా రామ్‌, నాయకుడు కిషన్‌ పరీక్‌ ప్రసంగించారు. బికనీర్‌ జిల్లా దుంగర్గర్‌ లో జన ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. దుంగర్గర్‌ ప్రస్తుత ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి గిరిధరి విజయాన్ని ఆకాంక్షిస్తూ చేపట్టిన ర్యాలీలో భారీస్థాయిలో రైతులు పాల్గొన్నారు. ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.

91


       సదుల్పూర్‌ అభ్యర్థి సునీల్‌ పునియాకి మద్దతుగా భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌, కేంద్ర కమిటీ సభ్యుడు విక్రమ్‌ సింగ్‌ పాల్గొన్నారు. రాజ్‌గఢ్‌ జిల్లాలోని చురు పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బృందాకరత్‌ ప్రసంగించారు.
       సిపిఎం అభ్యర్థి సునీల్‌ పునియాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి సిపిఎం నాయకులు మైచంద్‌ బాగోరా అధ్యక్షత వహించారు. ఈ సభలో కేంద్ర కమిటీ సభ్యులు విక్రమ్‌ సింగ్‌, రాజ్‌గఢ్‌ జిల్లా సిపిఎం కార్యదర్శి నిరుపమ్‌ కుమార్‌, సునీల్‌ పునియా ప్రసంగించారు. ఈ సభకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.