చిత్తూరు (తిరుపతి) : రామతీర్థం ఘటన బిజెపి గుండాల పనేనని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి, సిడబ్ల్యూసి సభ్యులు చింతామోహన్ ఘాటు విమర్శలు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసింది బిజెపికి గుండాలేనని, ఇది ఇతర పార్టీలకు సంబంధం లేదని అన్నారు. తిరుమల బాలాజీ నగర్లో శిలువ గుర్తులతో అన్య మతప్రచారం జరుగుతోందని ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చారని అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలను ఆపే దమ్ము వైసిపి, టిడిపిలకు లేదని పేర్కొన్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని శ్రీకాళహస్తి, వెంకటగిరిలోనూ బిజెపి ప్రణాళికలు వేస్తోందని అన్నారు. శ్రీకాళహస్తిలో బిజెపి కులం పేరుతో సభలు పెడుతోందని తెలిపారు. ఒబిసిలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన గుర్తు చేశారు.










