Nov 20,2023 15:42

ప్రజాశక్తి-అమరావతి : స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్‌ బెయిల్‌ రావడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. చంద్రబాబుకి రెగ్యులర్‌ బెయిల్‌ రావడం సంతోషకరమని అన్నారు. న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడామన్నారు. తప్పుడు కేసులు న్యాయాస్థానాల ముందు నిలబడవని జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి అని సూచించారు. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ఏపీ సీఐడీ మానుకోవాలి అని సూచించారు. జగన్‌ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఇప్పటికీ సీఐడీ బుకాయించడం సిగ్గుచేటన్నారు. అక్రమ కేసులు వాదించేందుకు న్యాయవాదులకు కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. జగన్‌ రెడ్డి నియంతపాలనకు చరమగీతం పాడేందుకు చంద్రబాబు త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఇకపోతే స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.