
ప్రజాశక్తి - కర్నూలు క్రైం : అక్రమంగా నాటుసారా తయారీ , నిల్వ , అక్రమ మద్యం, అక్రమ రవాణా, అమ్మకాలపై వారం రోజులుగా జిల్లా పోలీసు యంత్రాంగం, సెబ్ అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విస్తృతంగా దాడులు చేశారని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ మంగళవారం ఒక ప్రకటనలో వివరాలను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలనకు జిల్లా పోలీసులు సమిష్టిగా నాటుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారన్నారు. నాటుసారా తయారుచేసే 21 గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. నాటుసారా పై 20 కేసులు, 22 మంది అరెస్టు , 366 లీటర్ల నాటుసారా సీజ్ , 3,745 లీటర్ల నాటు సారా బెల్లం ఊటను ధ్వంసం , 769 కేజీల బెల్లం సీజ్ , 5 వాహనాలు సీజ్ చేశారన్నారు. అక్రమ(తెలంగాణ, కర్ణాటక) మద్యం రవాణ పై దాడులకు సంబంధించి అక్రమ మద్యం పై 24 కేసులు, 26 మంది అరెస్టు , 358.7 లీటర్ల మద్యం సీజ్, 7 వాహానాలు సీజ్ చేశారన్నారు. బైండ్ ఓవర్ కేసులకు సంబంధించి నాటు సారా పై 52 మందిని, అక్రమ మద్యం పై 7 మంది ని బైండ్ ఓవర్ చేశారన్నారు. షరతులను ఉల్లంఘించిన ఒకరి పై బ్రీచ్ ఆఫ్ బాండ్ ను జప్తు చేసి రూ. 15 వేల జరిమానా విధించారని చెప్పారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజనాకు జమ చేశామని తెలిపారు. నాటుసారా పై విస్తృతంగా గ్రామాలలో ఆర్ ఎస్సై , 12 మంది స్పెషల్ పార్టీ పోలీసులచే దాడులు చేస్తున్నామన్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే అక్రమ నాటుసారా తయారీ , అక్రమంగా మద్యం రవాణా, విక్రయాలకు పలుమార్లు పాల్పడే వ్యక్తులపై పిడి యాక్టులు కూడా నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.