Jan 08,2021 07:14

న్యాయం ఆలస్యం కావడం అన్యాయం జరగడంతో సమానం. తక్షణ న్యాయం పరిపూర్ణ న్యాయం. భారత సుప్రీంకోర్టులో సుమారు 62,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టుల్లో 5152921 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దిగువ, జిల్లా కోర్టులలో సుమారు 3 కోట్ల 47 లక్షల వివాదాస్పద కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రస్తుత వేగంతో పరిష్కరించేట్లయితే... వివాదాస్పద కేసులన్నింటినీ కోర్టులు పరిష్కరించడానికి 300 సంవత్సరాలు పడుతుంది.
కేసులు పేరుకుపోవడానికి ప్రధాన కారణం దేశంలో న్యాయమూర్తులు లేకపోవడం. భారతదేశంలో న్యాయమూర్తుల సంఖ్య చాలా తక్కువ. ఆస్ట్రేలియాలో, ఒక మిలియన్‌ మందికి 42 మంది న్యాయమూర్తులు, కెనడాలో 75, బ్రిటన్లో 51, అమెరికాలో 107, భారతదేశంలో 1 మిలియన్‌ ప్రజలకు 11 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. దిగువ కోర్టులలో 17,900 మంది న్యాయమూర్తులు పని చేస్తున్నారు. దేశానికి కనీసం 10,000 మంది న్యాయమూర్తులు అవసరం.
విచారకరమైన విషయం ఏమిటంటే దేశంలో 150 కేసులు 60 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 30 సంవత్సరాలకు పైగా 90,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ కోర్టులలో 10 సంవత్సరాలకు పైగా 28.23 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 5 సంవత్సరాలకు పైగా 60 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
కోర్టుల ఆధునీకరణ అవసరం. దేశంలోని అన్ని కోర్టులను కంప్యూటరీకరించాలి. న్యాయమూర్తులందరికీ ల్యాప్‌టాప్‌లు, వైఫై, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా ఉపయోగించడంపై శిక్షణ ఇవ్వాలి. కోర్టులలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, వీడియో కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యాలు ఉండాలి. న్యాయమూర్తుల కోసం వేలాది పోస్టులు దేశంలో ఖాళీగా ఉన్నాయి, వీటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో అలహాబాద్‌ హైకోర్టు దేశంలో అగ్రస్థానంలో ఉంది. అలహాబాద్‌ హైకోర్టులో 7.46 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పంజాబ్‌, హర్యానా హైకోర్టులో 6.07 లక్షల కేసులు, మద్రాస్‌ హైకోర్టులో 5.7 లక్షలు, రాజస్థాన్‌ హైకోర్టులో 5.07 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సిక్కిం హైకోర్టులో అత్యల్ప సంఖ్య ఉంది. 240 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌ లోని వివిధ జిల్లా స్థాయి, దిగువ కోర్టులలో 82 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మహారాష్ట్రలో 42 లక్షల వివాదాస్పద కేసులు ఉండగా, బీహార్‌లో 31 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
దేశంలోని వివిధ హైకోర్టులలో 3677089 సివిల్‌ కేసులు ఉండగా 1475832 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీని రివర్స్‌ స్టోరీ దేశంలోని దిగువ కోర్టులలో ఉంది. ప్రస్తుతం దేశంలోని వివిధ జిల్లా కోర్టులు, దిగువ కోర్టులలో 25 మిలియన్‌ క్రిమినల్‌ కేసులు, 94.5 లక్షల సివిల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడానికి కోర్టుల కంప్యూటరీకరణ అవసరం. న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలి. ప్రభుత్వం ఈ దిశలో తీవ్రంగా కృషి చేసినప్పుడే...ప్రజలకు వేగంగా న్యాయం చేయాలనే కల నెరవేరుతుంది.
                                                                              ప్రొ|| వివేక్‌ సింగ్‌            వ్యాసకర్త సెల్‌: 91520 78747