
ఛండీగడ్ : హర్యానాలోని నుహ్ జిల్లాలో వరుసగా నాలుగోరోజైన ఆదివారం కూడా కూల్చివేతలు కొనసాగాయి. సహారా హోటల్ను ప్రభుత్వం కూల్చివేసింది. ఈ హోటల్ పై కప్పు నుండే కొందరు వ్యక్తులు మతపరమైన ఊరేగింపుపై రాళ్లు రువ్వారని అధికారులు ఆరోపిస్తూ హోటల్ ను కూల్చివేశారు. అరెస్టులకు భయపడి చాలా మంది ఊరి నుండి పారిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హర్యానా సిఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేత చేపట్టినట్లు నుహ్ ఎస్డిఎం అశ్విని కుమార్ తెలిపారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో ఇటీవల మత హింసకు కారణమంటూ గత మూడు రోజులుగా పలు దుకాణాలను, నివాసాలను రాష్ట్రప్రభుత్వం కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. నల్హార్ ప్రాంతంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద ఉన్న ఆసుపత్రి వద్ద ఉన్న సుమారు 60 మెడికల్ షాపులు, ఇతర దుకాణాలు, నివాసాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు.