స్టాకహేోం : రసాయశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. మోంగి బావెండి, లూయిస్ బ్రుస్, అలెక్సి ఎకిమోవ్లను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కమిటీ బుధవారం ప్రకటించింది. క్వాంటమ్ డాట్స్ విశ్లేషణ, ఆవిష్కరణలో, నానో పార్టికల్స్ అభివృద్ధిలోనూ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది.
క్వాంటమ్ డాట్స్, నానో పార్టికల్స్కు విశిష్టమైన గుణాలు ఉన్నాయి. ఎల్ఇడి టెలివిజన్ స్క్రీన్లు, సోలార్ ప్యానెల్లు మరియు వైద్య చికిత్సలో క్వాంటం డాట్లను అధికంగా వినియోగిస్తుంటారు. శస్ర్త చికిత్సలో కణితులను తొలగించడంలో వైద్యులకు సహాయపడతుంటాయి. భవిష్యత్తులో జరగబోయే క్వాంటమ్ కమ్యూనికేషన్ కోసం క్వాంటమ్ డాట్స్ కీలకం కానున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటనలో తెలిపింది.
అయితే రసాయన శాస్త్రంలో బహుమతి గ్రహీతల పేర్లు ప్రకటనకు ముందే లీక్ అయినట్లు, కొన్ని గంటల ముందు స్వీడిష్ మీడియా సంస్థలు ప్రకటించాయి. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయని, నోబెల్ కమిటీ ప్రకటించేంతవరకు విజేతల పేర్లు బయటకు రాకుండా చూసేందుకు తీవ్రంగా యత్నిస్తుంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.