
యాండే : మధ్య ఆఫ్రికాలోని కామెరూన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా ఆయిల్ను తరలిస్తున్న ఒక లారీ ప్రయాణికుల బస్సును ఢకొీన్న ఘటనలో 53 మంది మరణించగా, 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన కామెరూన్ పశ్చిమ ప్రాంతంలోని శాంక్చు గ్రామ సమీపంలో జరిగింది. రెండు వాహనాలు ఢకొీనడంతో పాటు అనంతరం ఆయిల్ ఎగిసిపడ్డ కారణంగా పెద్దయెత్తున్న మంటలు చెలరేగడంతో ఇంతటి ఘోరం సంభవించిందని పశ్చిమ ప్రాంత గవర్నర్ అవా పోంకా ఆగస్టిన్ వెల్లడించారు. క్షతగాత్రులను సమీప స్కాంగ్, బఫోస్సామ్ పట్టణాల్లోని ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన లారీ అక్రమంగా ఆయిల్ తరలిస్తోందని చెప్పారు. ప్రయాణికులతో కూడిన బస్సు తీర ప్రాంతంలోని దౌలా నగరం నుంచి కామెరూన్ పశ్చిమ ప్రాంత రాజధాని బఫోస్సామ్కు వెళ్తోందని, ఈ మార్గంలో ఎదురుగా వేగంగా వస్తున్న ఆయిల్ లారీ బస్సుపైకి దూసుకెళ్లిందని తెలిపారు. దీంతో రెండు వాహనాల్లో భారీయెత్తున మంటలు రేగి, పూర్తిగా కాలిపోయాయని పేర్కొన్నారు. ప్రమాదం నుంచి తీవ్ర కాలిన గాయాలతో బయటపడిన 29 మందిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించామన్నారు. ప్రమాదం గురించి తెసుకున్న బాధిత కుటుంబసభ్యులు ఆసుపత్రులకు చేరుకున్నారు. మరణించిన తమ బంధువులను గుర్తుపట్టడం అసాధ్యం ఉందని, గుర్తుపట్టలేని విధంగా వారి శరీరాలు అగ్నికి ఆహుతయ్యాయని తన సోదరుడి కోసం వెతుకుతున్న ఒక 54 ఏళ్ల వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.