ప్రజాశక్తి-కాల్గరీ కెనడా : కాల్గరీ కెనడాలో, అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ, షిర్డీ సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తలు లలిత ద్వివేదుల మరియు శైలేష్ భాగవతుల ఆధ్వర్యంలో గణపతి ఊరేగింపు వేడుకలు కాల్గరీ నగర డౌన్ టౌన్ వీధులలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజ్కుమార్ శర్మ మందిరంలో ప్రతిరోజు గణపతి అభిషేకము, అర్చన, గణపతి హోమము మరియు హారతులు విధిగా నిర్వహించారు. గణపతి నవరాత్రి మరియు ఊరేగింపు సంబరాలు ఘనంగా నిర్వహించుటకు చాలా మంది వాలంటీర్లు మరియు వ్యాపార యజమానులు తమ ప్రత్యేక సహాయాన్ని అందించారు. నగర వీధుల్లో గణపతి ఊరేగింపు కోసం హెచ్&హెచ్ డెకర్స్, హేమ మరియు హర్షిణి ట్రక్ ను ఎంతో అందంగా అలంకరించారు. గణనాధుని యాత్రకు కాల్గరీ ఎమ్మెల్యే అయిన గౌరవనీయులైన పీటర్ సింగ్ గారు విచ్చేసారు, ఊరేగింపులో పాల్గొన్న భక్తులను, ప్రజలను ఉద్దేశించి కాల్గరీ నగరంలో ఇటువంటి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అనఘా దత్త యజమాన్యం వారిని ప్రశంసించారు. మరిన్ని భారతీయ సంప్రదాయాన్ని చాటిచెప్పే ఇటువంటి కార్యక్రమలని, అల్బెర్టా ప్రావిన్స్ కల్చర్ డేస్ ను పురస్కరించుకుని భారతీయ శాస్త్రీయ కళలు మరియు నృత్య కచేరీలు, హిందూ వారసత్వ వేడుకలు జరుపుతున్నందుకు లలిత మరియు శైలేష్ ను ఎంతో అభినందించారు.
గణపతి ఉరేగింపును అర్చకులు రాజ్ కుమార్ గణపతి తాళం, అర్చన, హారతి తో ప్రారంభించగా భక్తులు "శ్రీ గణేష్ మహరాజ్ కి జై" అనే నినాదాలతో యాత్ర కొనసాగింది. లోహిత్, ఓం సాయి మరియు ఫణి భజనలతో, పాటలతో గణపతిని స్తుతించారు. కాల్గరీ సిటీ మునిసిపల్ హాల్ వద్ద మొదలైన గణపతి ఊరేగింపు షా మిలీనియం పార్క్ చేరుకునే వరకు సుమారు ఐదు వందలకు పైగా భక్తులు ఆనందంతో నాట్యం చేస్తూ గణపతి నామ సంకీర్తన చేశారు. ఉత్తర అమెరికా ఖండంలో ఇటువంటి వేడుకలు జరపడం కష్టమైనప్పటికీ శ్రీ అనఘా దత్తా సొసైటీ ఆఫ్ కాల్గరీ యాజమాన్యం మరియు సభ్యులు ఎన్నో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, రానున్న భావితరాలకి భారత సంప్రదాయ పూల బాటలు వేస్తున్నారని అందరూ ప్రశంసించారు. ఊరేగింపు ముగిసిన తర్వాత గణపతికి హారతి ఇచ్చి భక్తులందరికి ప్రసాద వితరణ చేశారు.
కెనడా లో హిందూ వారసత్వ వేడుకల్లో నిర్వహించిన వయోలిన్ కచేరీలో కెనడాలో, యూఎస్ఏలో ఉన్న విద్వాంసులైన ఆరతి శంకర్, అంజనా శ్రీనివాసన్ వయోలిన్ వాయించగా, ఆదిత్య నారాయణ్ మృదంగంతో, రమణ ఇంద్ర కుమార్, ఘటంతో, రత్తన్ సిద్ధు, తంబురాలతో సహకరించారు. విద్వాంసుల అందరిని అనఘా దత్త సంఘం అధ్యక్షురాలు లలిత బహుమతులతో ఘనంగా సత్కరించారు. అక్టోబర్ మాసంలో రానున్న దేవి నవరాత్రి ఉత్సవాలకి లలిత, స్వచ్ఛంద సేవకులైన శోభన నాయర్, మాధవి చల్లా, మాధవి నిట్టల, కళైజ్ఞర్ సంతానం మరియు అర్చకులు రాజ్కుమార్ ఘనమైన సన్నహాలు జరుపుతున్నారు. అనఘా దత్త సంఘం వారు నిర్వహించు దేవి నవరాత్రి వేడుకలతో, కొన్ని వేల మంది భక్త జన సమూహంతో పూజలనందుకునే అనఘా అమ్మవారి వేడుకల వల్ల కెనడాలో కాల్గరీ నగరం "కాళి" గిరిగా మారుతుందని భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. లలిత మరియు ఎన్నో వాలంటీర్లు రేయిం బవళ్ళు శ్రమించారు. ఈ వేడుకల్లో షుమారు 800 మందికి పైగా పాల్గొని ఈ వేడుకలు జయప్రదంగా ముగిసింది.