Mar 30,2023 16:26

చెన్నై   :   తమిళ నాట ఆందోళనలతో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ-ఫసీ) వెనక్కి తగ్గింది. తాజాగా గురువారం ఆ ఆదేశాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఫసీ తెలిపింది. పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌ పేరుతో పాటు బ్రాకెట్‌లో దహీ, తయిర్‌, మోసారు వంటి ప్రాంతీయ భాషలను వినియోగించవచ్చని తెలిపింది. ఇటీవల తమిళనాడు మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ (టిఎంపిఎఫ్‌) కు 'పెరుగు' పేరుపై ఫసీ ఈ ఏడాది జనవరిలో కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లంలో ఉన్న 'కర్డ్‌' , తమిళంలో ఉన్న 'తయిర్‌' పేర్లను తొలగించి.. 'దహీ' అని హిందీలోకి మార్చాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ ఆదేశాలపై స్టాలిన్‌ తీవ్ర ఆగ్రవ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దాలనే వారి పట్టుదల మరింత పెరుగుతోందని, చివరకు పెరుగు ప్యాకెట్‌పైనా తమ మాతృభాషలో ఉన్న పేరును మార్చేసి హిందీలో రాయమని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతృభాషల పట్ల ఇలాంటి నిర్లక్ష్యం పనికిరాదని, దీనికి బాధ్యులైన వారిని దక్షిణాది శాశ్వతంగా బహిష్కరిస్తుందని స్టాలిన్‌ ధ్వజమెత్తారు. అలాగే ఫసీ నిర్ణయాన్ని తమిళనాడు పాల ఉత్పత్తిదారుల  సమాఖ్య 'ఆవిన్‌ ' కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. తాము 'దహీ' అనే పేరును వినియోగించబోమని స్పష్టం చేసింది. వచ్చే ఆగస్టులోగా ఈ ఆ ఆదేశాలను అమలు చేయాలని తమ ప్రభుత్వానికి లేఖ అందిందని పాడి పరిశ్రమ అభివృద్ధి  శాఖ మంత్రి ఎస్‌.ఎం. నాజర్‌   తెలిపారు. హిందీకి రాష్ట్రంలో చోటు లేదని అన్నారు.   తమిళనాడుతో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు కూడా ఇలాంటి ఆదేశాలు పంపినట్లు సమాచారం.