Jul 28,2023 15:53
  • పెదమల్ల మాచేనమ్మ ఆలయం పరిసరాల్లో చేరిన  వరద నీరు.......
  • పెదమల్లం వద్ద కొబ్బరికాయలను ఇంజన్ పడవల ద్వారా తరలిస్తున్న రైతులు 

ప్రజాశక్తి-ఆచంట( పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి గంట, గంటకు పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వశిష్ట గోదావరి మరింత ఉదృతంగా మారింది. ధవలేశ్వరం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు సముద్రంలోకి వదులుతుండడంతో వశిష్ట గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో లంక గ్రామాలకు వరద నీరు మెల్లమెల్లగా చేరుతుంది. మండలంలో పుచ్చల లంక, నెక్కిడి లంక, రాయిలంకలు ముంపు బారిన పడ్డాయి. అయోధ్య లంకలో పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుంది. అయోధ్య లంకలో ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. లంక వాసులకు రాకపోకలు నిలిచిపోవడంతో వారు నిత్యావసరాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భీమలాపురం ఏటిగట్టుకు దిిిగువన ఉన్న కాపులపాలెం లో వరద నీరు చుట్టుముడుతుంది.  

  • నీట  మునిగిన పంటలు 

లంక గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో వందలాది ఎకరాల్లో పంటలు నీట  మునిగాయి . ప్రధానంగా తమలపాకు పండించిన రైతులకు తీవ్ర నష్టాలు తప్పడం లేదు. లక్షల రూపాయల పెట్టుబడిలో పెట్టమని రైతులు వాపోతున్నారు. పచ్చిమిర్చి, అరటి, వంగా బెండ బీర ఆనభ చిక్కుడు, మునగ, తోటకూర గోంగూర తదితర ఇతర కూరగాయ తోటలు కూడా నీట మునిగి పూర్తిగా నీట మునిగాయి. రైతులు సురక్షిత ప్రాంతాలకు పశువులను తరలిస్తున్నారు. లంక గ్రామాల నుంచి కొబ్బరికాయలను ఇంజన్ పడవల ద్వారా ఏటిగట్టుకు తరలిస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు కోరుతున్నారు.