
అమరావతి: ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించిన గెజిట్ను కేంద్రన్యాయశాఖ గురువారం విడుదల చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించిన అనంతరం రాష్ట్రపతి ఈమేరకు నిర్ణయించారు. అలాగే సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించాలని జస్టిస్ మహేశ్వరీకి సూచించారు. జస్టిస్ అరూప్ గోస్వామి 1961 అస్సాంలోని జోర్హాట్లో జన్మించారు. గువాహటి ప్రభుత్వ న్యాయకళాశాల నుండి 1985లో న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1985 ఆగస్టు 16న న్యాయవాదిగా తన పేరును నమోదు చేసుకున్నారు. గువహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 అక్టోబర్ 15న సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉద్యోగోన్నతి పొందారు.