Apr 20,2023 06:05

శనివారం రాత్రి పదిన్నర గంటలపుడు (ఏప్రిల్‌ 15వ తేదీ) పటిష్టమైన పోలీసు బందోబస్తులో విలేకర్లతో మాట్లాడుతుండగా అతిక్‌ అహమ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌ అహమ్మద్‌ అనే నేరగాళ్లను ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఉత్తర ప్రదేశ్‌లో శాంతి భద్రతలకు ఇది చక్కటి ఉదాహరణ. అంతకు రెండు రోజుల ముందు అతిక్‌ అహమ్మద్‌ 19 ఏళ్ల కుమారుడిని, అతని అనుచరుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని వేరే చెప్పనవసరం లేదు. దాని కొనసాగింపుగానే అతిక్‌ సోదరులను ఒక పథకం ప్రకారం మట్టుబెట్టించారని అనేక మంది భావిస్తున్నారు. పేరు మోసిన గూండాలను కాల్చి చంపినా తప్పు పడితే ఎలా అని తక్షణ న్యాయం కావాలని కోరుకొనే కొందరు ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్య ముసుగులో ఎన్‌కౌంటర్లు సమాజానికి పీడగా ఉండే నేరగాళ్లకే పరిమితం కావు. తమకు నచ్చనివారిని సైతం అధికారంలో ఉన్న పెద్దలు ఏదో ఒక సాకుతో ఏరిపారవేస్తారు. తమ దాకా వచ్చినపుడు గానీ ''తక్షణ న్యాయ'' వాదులకు ఈ అంశం అర్ధం కాదు. అలా కోరుకోవటం, అలాంటి ఉదంతాలకు మద్దతు ఇవ్వటం అంటే నిరంకుశ శక్తులను ప్రోత్సహించటమే.
ఉత్తరప్రదేశ్‌లో యోగి అధికారానికి వచ్చిన తరువాతే నేరగాళ్లను మట్టుబెట్టి పీడ లేకుండా చేస్తున్నట్లుగా ప్రచారం పెద్దఎత్తున సాగుతున్నది. 2017 నుంచి ఇప్పటి వరకు ఎన్‌కౌంటర్లలో 183 మంది నేరగాళ్లను లేపివేసిన బాహుబలిగా వర్ణిస్తున్నారు. జాతీయ మానవ హక్కుల సంస్థ సమాచారం ప్రకారం 2017 మార్చి నుంచి 2022 మార్చి నెల వరకు దేశంలో ప్రతి మూడు రోజులకు ఒక ఎన్‌కౌంటర్‌ చొప్పున, 813 మంది మరణించినట్లు వెల్లడించింది. ఇవన్నీ ఉత్తరప్రదేశ్‌లో జరిగినవి కాదు. దుండగులు తమ దగ్గర ఉన్న తుపాకులను లాక్కొనేందుకు, తమ కస్టడీ నుంచి పారిపోయేందుకు, తనిఖీ జరుపుతుండగా కాల్పులు జరిపినపుడు ఆత్మరక్షణ కోసం కాల్చినట్లు పోలీసులు చెప్పటం తెలిసిందే.
జాతీయ మానవ హక్కుల సంస్థ సమాచారం ప్రకారం 2002 నుంచి 2008 వరకు దేశంలో 440 ఎన్‌కౌంటర్‌ కేసులు జరిగాయి. రాష్ట్రాల వారీ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్‌లో 231, రాజస్థాన్‌లో 33, మహారాష్ట్రలో 31, ఢిల్లీలో 26, ఆంధ్రప్రదేశ్‌లో 22, ఉత్తరాఖండ్‌లో 19 ఎన్‌కౌంటర్లు జరిగాయి. తరువాత 2009 అక్టోబరు నుంచి 2013 ఫిబ్రవరి వరకు 555 ఉదంతాలు జరగ్గా రాష్ట్రాల వారీ ఉత్తరప్రదేశ్‌లో 138, మణిపూర్‌లో 62, అసోంలో 52, పశ్చిమ బెంగాల్‌ 35, జార్ఖండ్‌లో 30 ఉన్నాయి. వీటిలో కొన్ని రాష్ట్రాలలో ఉగ్రవాదులు, వేర్పాటువాదులు మరణించారు. ఈ కాలంలో యోగి అధికారంలో లేరు. ఉత్తరప్రదేశ్‌లో వేర్పాటువాదం లేదా నక్సల్‌ సమస్య లేదు. జరిగిన ఎన్‌కౌంటర్లలో అగ్రస్థానంలో ఎందుకు ఉన్నట్లు? ఉత్తరప్రదేశ్‌ పోలీసు కస్టడీ మరణాలకు పేరుమోసింది. దీని గురించి ఎక్కడా ప్రచారం ఎందుకు జరగదు? వారంతా ఎవరు, నేరగాళ్లేనా? టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2022 జులై 26 నాడు ప్రచురించిన వార్త చెప్పిందేమిటి? 2020 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2022 మార్చి 31 వరకు ఎన్‌హెచ్‌ఆర్‌సి సమాచారం ప్రకారం దేశంలో 4,484 పోలీస్‌ కస్టడీ మరణాలు, 233 ఎన్‌కౌంటర్‌ మరణాలు జరిగినట్లు లోక్‌సభకు ప్రభుత్వం తెలిపింది. వీటిలో ఉత్తరప్రదేశ్‌ 952 మరణాలతో అగ్రస్థానంలో ఉంది. నరేంద్ర మోడీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఈ దుర్మార్గం ఏమిటనిగానీ, ప్రజాస్వామ్య కబుర్లు చెపితే జనం ఏమనుకుంటారని గానీ ఎప్పుడైనా ఆత్మావలోకనం చేసుకున్నారా?
ఒక పెట్టుబడిదారుడిని చంపినంత మాత్రాన దోపిడీ, ఒక భూస్వామిని చంపినంత మాత్రాన గ్రామాల్లో అణచివేత అంతరించదు. అలాగే గూండాలను చంపినంత మాత్రాన గూండాయిజం అంతం కాదు. అదే జరిగి ఉంటే 1990 దశకం నుంచి 2000 దశకం వరకు ముంబై, మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో గూండాలు, మాఫియా డాన్లను పోలీసులు చంపివేశారు. వాటితో అక్కడ ఇప్పుడు గూండాయిజం అంతరించిందా? కొత్తవారు పుట్టుకొస్తూనే ఉంటారు. ఏప్రిల్‌ 13న ఎన్‌కౌంటర్‌లో చంపిన పందొమ్మిదేళ్ల అతిక్‌ అహమ్మద్‌ కుమారుడికి యోగి అధికారంలోకి వచ్చే నాటికి 13 సంవత్సరాలుంటాయి. అతను ఈ కాలంలో గూండాగా మారాడా? నిజంగా మారితే ఎన్‌కౌంటర్లను, బాహుబలి యోగిని ఖాతరు చేయటం లేదనుకోవాలి, అలా కాకపోతే తండ్రి అతిక్‌ అహమ్మద్‌ మీద కసి తీర్చుకొనేందుకు పోలీసులు అతగాడిని హతమార్చి ఉండాలి. ఏది నిజం? చట్టబద్ద పాలన సాగుతోందా, విరుద్ధంగా ఉందా?
అతిక్‌ అహమ్మద్‌ సోదరులను చంపిన ముగ్గురు నేరగాళ్ల గురించి చూస్తే వారిలో లవలేష్‌ తివారీ సంఘ పరివార్‌ ఏర్పాటు చేసిన బజరంగ్‌దళ్‌ నేతగా ఉన్నాడని వార్తలు. తమకేం సంబంధం లేదని ఆ సంస్థలు ప్రకటించటం ఊహించనిదేమీ కాదు. ఫేస్‌బుక్‌లో తనను బజరంగ్‌ దళ్‌ జిల్లా సహ నేతగా వర్ణించినపుడే తమకే సంబంధం లేదని ప్రకటించి ఉంటే వేరు. ఇప్పుడు చెబుతున్నారంటే గాడ్సేను కూడా అలాగే తమ వాడు కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పిన సంగతి గుర్తుకు వస్తోంది. నేరం చేసిన తరువాత 'జై శ్రీరామ్‌' అనటాన్ని బట్టి, ముగ్గురూ కలసి వచ్చారంటే మిగిలిన ఇద్దరు కూడా ఆ బాపతే లేదా తోడు తెచ్చుకున్న నేరగాళ్లన్నది స్పష్టం. వివిధ ప్రాంతాలకు చెందిన వారిని పోలీసులే ఒక దగ్గరకు చేర్చి ఉండాలి. గతంలో వారి మీద కేసులు ఉన్నప్పటికీ ముగ్గురూ కలసి చేసినట్లు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. విధి నిర్వహణలో ఉన్న 17 మంది పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేసినట్లు వచ్చిన వార్తలు ఫేక్‌ అని, ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని అదానీ ఆధీనంలోని ఎన్‌డిటివి పేర్కొన్నది. లవలేష్‌ తివారీతో తమకెలాంటి సంబంధం లేదని కుటుంబం చెప్పిందట. కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడటం లేదని కూడా తండ్రి చెప్పాడట. తాను బ్రాహ్మణుడినని, శాస్త్రాలను గాక ఆయుధాలు పట్టుకు తిరుగుతానని లవలేష్‌ చెప్పేవాడట. సన్నీ అనే నేరగాడు రౌడీ షీటర్‌. పద్నాలుగు కేసులున్నాయి. ఎలా నేరగాడిగా మారిందీ తెలియదని సోదరుడు చెప్పాడు. మూడోవాడు అరుణ్‌ చిన్నపుడే ఇల్లు వదలి వెళ్లాడు. తాము పేరు మోసిన నేరగాళ్లం కావాలనే కోరికతో అతిక్‌ సోదరులను కాల్చి చంపినట్లు పోలీసులకు చెప్పారట. యోగి పాలన ఇలాంటి ఉత్తేజాలకు దోహదం చేస్తున్నట్లే కదా! ఇలాంటి గూండాలను ఒక దగ్గరకు చేరుస్తోందా?
యోగి ఆదిత్యనాథ్‌ అధికారానికి వచ్చిన తరువాత ఇప్పటి వరకు పది వేలకు పైగా ఎన్‌కౌంటర్లు జరిపారని వార్తలు. దీనితో నేరాలు అదుపులోకి వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ నేరాల వివరాలను చూసినపుడు అలాంటి దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వ జాతీయ గణాంకాలను (పట్టిక) చూద్దాం.

woman-fight-for-missing-husband-case-in-asom-jeevana-story

పట్టికలో వున్న వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో యోగి అధికారానికి రాక ముందు 2016లో నమోదైన అన్ని రకాల కేసులు 4,94,025 ఉంటే 2020లో అవి 6,57,925కు పెరిగాయి. దేశంలో 45,75,746 నుంచి 62,91,485కు చేరాయి. దేశంలో పెరిగినట్లుగానూ ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఉన్నాయి. మొత్తం కేసులలో అక్రమంగా ఆయుధాలు కలిగినవి 2021లో దేశంలో వందకు 3.3 ఉంటే ఉత్తరప్రదేశ్‌ 11.8 శాతంతో అగ్రస్థానంలో ఉంది. రెండంకెలు గల రాష్ట్రం మరొకటి లేదు. అలాంటి స్థితిలో అక్కడి జనం ప్రశాంతంగా నిద్రపోతారా? యోగి ఆదిత్యనాథ్‌కు రెండు తుపాకులకు లైసెన్సు కూడా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సర్వసంగ పరిత్యాగి, నిరంతరం భద్రతా వలయంలో ఉండే యోగి పరిస్థితి ఇది. గూండాలను అణచివేస్తే అన్ని అక్రమ ఆయుధాలు ఎలా ఉంటాయి?

ఎన్‌కౌంటర్ల గురించి ప్రచారం మీద చూపిన శ్రద్ధ ఇతర అంశాల మీద లేదు. తమకు విధించిన జీవితకాల శిక్ష గురించి చేసుకున్న అప్పీళ్లు సంవత్సరాల తరబడి విచారణకు రావటం లేదంటూ 18 మంది నేరస్థులు సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన విన్నపంలో అలహాబాద్‌ హైకోర్టులో 160 మంది జడ్జీలకు గాను 93 మందే ఉన్నారని పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు వారికి బెయిల్‌ ఇచ్చింది. ''బలహీన వర్గాలకు చెందిన వారు ఎప్పటికీ కస్టడీలోనే ఉంటున్నారు. మా అనుభవంలో అలాంటి వారు జైళ్లలో ఉంటున్నారు. ఉన్నత సమాజానికి చెందిన ఒక నేరగాడు శిక్ష పడే సమయానికి దేశం నుంచి తప్పించుకున్నాడని'' ఆ సందర్భంగా సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఇది యోగి సర్కార్‌ సిగ్గు పడాల్సిన అంశం. 2021 ఆగస్టు నాటికి 1.8 లక్షల క్రిమినల్‌ అప్పీళ్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. రెండు వేల సంవత్సరం నుంచి కేవలం 31,044 కేసులనే హైకోర్టు పరిష్కరించింది. పదేళ్లకు ముందు అప్పీలు చేసిన ఖైదీలు 7,214 మంది జైల్లో ఉన్నారు. 2017 మార్చి నుంచి 2021 ఆగస్టు వరకు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు జరిపిన 8,472 ఎన్‌కౌంటర్లలో 3,302 మంది నేరారోపణలు ఉన్నవారు గాయపడ్డారు. వారిలో 146 మంది మరణించారు. పోలీసు ఎన్‌కౌంటర్లు పెద్ద ఎత్తున జరిగాయీ అంటే...అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ యంత్రాంగం, న్యాయాన్ని అందించాల్సిన వ్యవస్థ విఫలమయ్యాయని అర్థంం. పోలీసు యంత్రాంగాన్ని ఎన్‌కౌంటర్ల విభాగంగా మార్చి, లోపించిన జవాబుదారీతనాన్ని సంస్కరించటం అంత తేలిక కాదు. ఏకు మేకై కూర్చుంటుంది. చివరకు పెంచి పోషించిన వారికే తలనొప్పిగా మారుతుంది. అధికారం మారితే అదే పోలీసు యంత్రాంగం పాలకులు ఎవరి మీద గురి పెట్టమంటే వారి మీదే తుపాకులను ఎక్కు పెడుతుంది.

koteswarao

 

 

 

              ఎం.కోటేశ్వరరావు