May 05,2023 13:25

పూణె  :   రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ)కి చెందిన శాస్త్రవేత్తను మహారాష్ట్ర యాంటి-టెర్రరిజమ్‌ స్క్వాడ్‌ (ఎటిఎస్‌) అరెస్ట్‌ చేసింది. పాకిస్తాన్‌  ఇంటెలిజెన్స్  ఏజెంట్‌కు రహస్య సమాచారాన్ని అందించారని, వాట్సప్‌, వీడియో కాల్‌ల ద్వారా ఆయన ఏజెంట్‌తో టచ్‌లో ఉన్నారని ఎటిఎస్‌ అధికారి  తెలిపారు. ఇది హనీ ట్రాప్‌ కేసు అని అన్నారు. ఆ శాస్త్రవేత్త డిఆర్‌డిఒలో సీనియర్‌ హోదాలో ఉన్నారని .. బుధవారం ఆయనను అరెస్ట్‌ చేసినట్లు ఆ అధికారి తెలిపారు. శత్రుదేశానికి చెందిన అధికారులు తన వద్ద ఉన్న రహస్యాలను దేశ భద్రతకు ముప్పుగా పరిణమించవచ్చని తెలిసినా ఆ శాస్త్ర వేత్త తన పదవిని దుర్వినియోగం చేసి శత్రు దేశాలకు వివరాలు అందించాడని ఎటిఎస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. అధికారిక రహస్యాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ముంబయిలోని ఎటిఎస్‌ కాలాచౌకి యూనిట్‌లో ఓ కేసు నమోదైందని, తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపింది.