Oct 21,2023 14:53

ప్రజాశక్తి-ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా లక్షలాది ఎకరాలలో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారని  హంద్రీనీవా,హెచ్ ఎల్ సి కెనాల్ ద్వారా డిసెంబర్ 30వ తేదీ వరకు సాగునీరు ఇవ్వాలని వజ్రకరూర్ సిపిఎం మండల కన్వీనర్ విరుపాక్షి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ, కార్మిక, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టినట్లు  విరపాక్షి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  రైతులు పడుతున్న ఇబ్బందులను,సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. డిసెంబర్ 30వ తేదీ వరకు సాగునీరు ఇవ్వకపోతే ఆత్మహత్యలు శరణ్యమన్నారు. నియోజకవర్గ పరిధిలో లక్షలాది ఎకరాలలో మిరప,పత్తి,కంది, వేరుశనగ తదితర పంటలను లక్షలాది రూపాయలు వెచ్చించి సాగు చేశారన్నారు.పంటలు పూతలు కాయలు కాసి చేతికొచ్చే సమయాలలో కెనాల్ లలో సాగునీరు సరఫరా చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. వేరుశనగ పంటలకు ఎకరాకు 50 వేలు మెరుపు పంటలకు ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి చిన్న,సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది అన్నారు. పంటలకు సాగు పెట్టుబడికి చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చాయాపురం రంగనాయకులు, చాబాల సుధాకర్, సిఐటియు నాయకులు సుధాకర్, హమాలీ సంఘం నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు.