Oct 28,2023 15:30
  • నవంబర్ 4 న జిల్లా కు బస్ జాతా 

ప్రజాశక్తి-పలమనేరు : అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా రక్షణ బేరి కార్యక్రమం జరుగుతున్నదని దీన్ని జయప్రదం చేయాలని సిపిఎం ప్రజా ప్రణాళికను శనివారం పలమనేరు సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారక్షణ భేరి జయప్రదం చేయడానికి జిల్లాలో నవంబర్ 4న బస్ జాతా వస్తున్నదని ఘనంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రజలందరినీ కలవరపరుస్తున్నాయి. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని ఎదురు చూసే కన్నా మన బ్రతుకులను రాష్ట్ర భవిష్యత్తును సక్రమంగా నడిపించడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో సిపిఎం అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రాన్ని విడగొట్టి పది సంవత్సరాలు పూర్తికావస్తోంది. అప్పుడు మనకు అరచేతులో స్వర్గం చూపించారు. కేంద్రంలోని బిజెపి నాయకులు ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు, రైల్వే జోన్ వంటి హామీలు ఇచ్చి ఈ ఒక్కటి కూడా హామీలు అమలు కాలేదు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రజా రక్షణ భేరి కార్యక్రమం నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది.  ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రణాళికను ప్రజలు ముందు ఉంచింది .కరెంట్ యూనిట్ రూపాయికే, పేదలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా, స్మార్ట్ మీటర్లు వద్దు, చార్జీలు రద్దు చేయాలని, 400 రూపాయలకే గ్యాస్, 60 రూపాయలకే లీటర్ పెట్రోల్, డీజిల్, ఇసుక ఉచితం, అందరికీ సంక్షేమం పెన్షన్, రేషన్ కార్డులు, అన్ని రకాల పెన్షన్లు 5000 రూపాయలు,పేదలకు రెండు సెంట్లు ఇల్లు, ఐదు లక్షల ఆర్థిక సాయం, 40 వేల టీచర్లకు మెగా డీఎస్సీ, 2 లక్షల 50 వేల ప్రభుత్వ ఖాళీ పోస్టులు, నిరుద్యోగ భృతి నెలకు 5000, ఓపీఎస్ పునరుద్ధరణ, ప్రైవేటు ఉపాధ్యాయులు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, భూమిలేని వ్యవసాయ కూలీలకు కౌలు రైతులకు రెండు ఎకరాల భూమి, అసలు పట్టాదారులకే అసైన్మెంట్ భూముల హక్కులు కల్పించడం, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 200 రోజులు, పని గ్యారంటీ అసంఘటితరంగా కార్మికుల కనీసం 26,000, సమగ్ర సంక్షేమ చట్టం స్కీం కార్మికుల ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, రైతులు గిట్టుబాటు ధర కల్పించడం లాంటి ప్రజా ప్రణాళికను సిపిఎం విడుదల చేసింది. అదేవిధంగా జిల్లాలో కూడా పలమనేరులో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీని అమలు చేయాలి .జిల్లాలో పండ్ల రైతులు ఆదుకోవడానికి పల్పి ఫ్యాక్టరీలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి .నగరి లో పవర్ లూం కార్మికులకు కూలి రేట్లు పెంచి, 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. చిత్తూరు జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇలాంటి సమస్యలపై ప్రజారక్షణ భేరే కార్యక్రమంలో సిపిఎం డిమాండ్ చేస్తున్నది. ప్రజా రక్షణ భేరి జయప్రదం చేయడానికి నవంబర్ 4న జిల్లాకు వస్తున్న బస్సు జాతాను జిల్లాలోని ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం నాయకులు ఓబులురాజు, గిరిధర్ గుప్తా, భువనేశ్వరి, నాయకులు ఈశ్వరయ్య,అంజి, ధనలక్ష్మి సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.