ప్రజాశక్తి-ఆదోని : సర్దుబాటు, ట్రు అప్ ఛార్జీల విధానం రద్దు ఎత్తివేయాలని సీపీఎం సీనియర్ నాయకులు మహానంద రెడ్డి, పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, నాయకులు గోపాల్, తిప్పన్న, వీరేష్, నాగరాజు, వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా చేపట్టే పోరాటాల కరప్రతాలను ఆ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వేసవి వేడిమి ఒకవైపు, విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఈనెల విద్యుత్ బిల్లులు చూడగానే ప్రజలకు కరెంట్ షాక్ కొట్టినట్లయిందన్నారు. కరెంటు బిల్లులే కాకుండా, ఫిక్స్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, సర్ చార్జీలు, విద్యుత్ సుంకం, సర్దుబాటు చార్జీలతో ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. అసలు కరెక్ట్ చార్జీల కంటే కొసరు చార్జీలు అధికమయ్యాయన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో జరుగు పోరాటాలలో ప్రజలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.










