
ఈటానగర్ : కొలీజియం వ్యవస్థ ఓ మైండ్ గేమ్ అంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అరుణాచల్ప్రదేశ్లో 4జీ సేవల కోసం నిర్మించిన 254 మొబైల్ టవర్లను శనివారం కిరణ్రిజిజు ప్రారంభించారు. వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకాలు సహా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన పలు సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న విషయంపై మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొలీజియం వ్యవస్థ గురించి వ్యాఖ్యానించను అంటూనే .. 'అదంతా ఓ మైండ్ గేమ్' అని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని తపిర్గావో లోక్సభకు కిరణ్ రిజిజు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొలీజియం వ్యవస్థ అనేది రాజ్యాంగంలోనే లేదంటూ గతంలోనూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.