Oct 19,2023 09:30

ప్రియమైన చిన్నారులూ,
నవంబరు 14 బాలల దినోత్సవం, దీపావళి సందర్భంగా 'ప్రజాశక్తి' స్నేహ అనుబంధాన్ని మీ కోసం ఒక ప్రత్యేక సంచికగా తేవాలని నిర్ణయించాం. ఈ సంచికకు గెస్ట్‌ ఎడిటర్‌గా బాల సాహిత్యవేత్త, ఆల్‌ ఇండియా రేడియో మాజీ డైరెక్టర్‌ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారు వ్యవహరిస్తారని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం.
ఇందులో మీరు రాసే రచనలకు, గీసే బొమ్మలకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రచురిస్తాం. కథలు, కవితలు, బొమ్మలు, సమీక్షలు, వ్యాసాలు.. ఇలా అన్ని ప్రక్రియల్లోనూ మీ సృజనకు ఈ సంచికలో చోటు ఇస్తాం.
చంద్రయాన్‌, సోలార్‌ మిషన్‌, ప్లాస్టిక్‌ భూతం, మట్టి వాసన, పచ్చదనం, స్నేహం, ఐక్యత .. ఇలా ఏ అంశం అయినా తీసుకోండి. కథగానో, కవితగానో, కబుర్లుగానో అల్లేయండి. కనువిందు చేసే బొమ్మలూ గీసేయండి!
రచనలు క్లుప్తంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి.
ఇంకా పెద్ద పెద్ద రచయితలు/ రచయిత్రులు కూడా చక్కని కథలు రాస్తారు. కబుర్లూ చెబుతారు.
గొప్ప గొప్ప చిత్రకారులు బొమ్మలు గీస్తారు. అవన్నీ మీ కోసమే!
ఇంకా ఇందులోనే గేయాలు, చిట్టిపొట్టి కథలు, పిల్లలు వేసే కార్టూన్లు కూడా ఉంటాయి.
మీరు కథో, కవితో రాయడంతో పాటు దానికి తగ్గట్టు బొమ్మలు కూడా గీయొచ్చు.
నవంబర్‌ 12న ఇచ్చే ఈ సంచిక మీకొక గొప్ప కానుకే కాదు; చక్కని జ్ఞాపకం కూడా అవుతుంది.
మీరంతా పదిలంగా దాచుకునేలా ఈ బాలల ప్రత్యేక సంచికను రూపొందిస్తాం.
దీనికి మీ సహాయం కావాలి. మీ భాగస్వామ్యం కావాలి.
ఎందుకంటే- ఈ సంచిక మీదే!
దీని రూపకర్తలూ మీరే!
మరి ఇంకెందుకు, ఆలస్యం?
పెన్ను తీసుకోండి. పెన్సిలు అందుకోండి.
కమ్మని కథలు రాయండి. చక్కని కవితలు అల్లండి.
అందమైన బొమ్మలు గీయండి.
బాగున్నారు అని మీరు అనుకున్నాక- ఈ దిగువ ఇచ్చిన మెయిల్‌ ఐడికీ పంపేయండి.
ఇంకా ఏమన్నా అడగాలంటే..
8333818985 నెంబరుకు కాల్‌ చేయండి.
                                                                                 
మీ రచనలు పంపాల్సిన మెయిల్‌ ఐడి :
november14spl@gmail.com
రచనలు, బొమ్మలూ చేరాల్సిన చివరి తేదీ : 31 అక్టోబరు 2023.

                                                                                               - సంపాదకులు