న్యూఢిల్లీ : భారత్లోని తమ దౌత్య కార్యాలయంలో అక్టోబర్ 1 నుండి కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ వెల్లడించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్లో ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో ఈ ఏడాది అక్టోబర్ 1 నుండి కార్యకలాపాలను నిలిపివేసే నిర్ణయాన్ని ప్రకటించినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. భారత్ ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడంతో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. ఊహించని మరియు దురదృష్టకర పరిస్థితుల కారణంగా, సిబ్బంది మరియు అందుబాటులో ఉన్న వనరులు రెండింటిలోనూ గణనీయమైన తగ్గింపు ఉందని, దీంతో కార్యకలాపాలను కొనసాగించడం మరింత సవాలుగా మారిందని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ మరియు భారత్ల మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను, దీర్ఘకాల భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. ఈ నిర్ణయం తీవ్ర విచారకరం అని రాయబార కార్యాలయం తెలిపింది.