ప్రజాశక్తి-ఆదోని : రజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపిను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న వారిపై మోడీ ప్రభుత్వం తీరు దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింప చేసిన మహిళా రెజ్లర్ క్రీడాకారులకు అండగా నిలవాల్సిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, బిజేపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఐదు రోజులుగా రాత్రి పగలు ఎండ వాన అనే తేడా లేకుండా రెజ్లర్ల క్రీడాకారులు జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తుంటే దేశవ్యాప్తంగా మేధావులు, ప్రజా సంఘాలు, మహిళ రైతు సంఘాలు, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ మాలిక్ లాంటి మేధావులు మద్దతుగా నిలుస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు లక్ష్మన్న, గణేష్, రాజు, మహేష్, శాంతి, నాగరాజు, రామస్వామి పాల్గొన్నారు.










