Sep 21,2023 14:58
  • జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు
  • మహాకవి గురజాడ కు ఘన నివాళులు

ప్రజాశక్తి-విజయనగరంకోట : గురజాడ నడయాడిన నేలపై జన్మించడం పూర్వ జన్మ సుకృతమని , అటువంటి మహనీయుని గృహంలో వారు వినియోగించిన వస్తువులను తాకడం అదృష్టమని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు పేర్కొన్నారు. మహాకవి గురజాడ 161 వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గురజాడ స్వగృహంలో వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రకాశనం గావించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, గురజాడ కుటుంభ సభ్యులు ప్రసాద్‌, ఇందిర, గురజాడ అభిమానులు పెద్ద సంఖ్య లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయి గేయాన్ని ఆలపిస్తూ పెద్ద సంఖ్యలో విద్యార్ధులతో గురజాడ జంక్షన్‌ వరకు గురజాడ వినియోగించిన వస్తువులతో ర్యాలీగా సాగి గురజాడ విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మాట్లాడుతూ.. గురజాడ వారు చెప్పిన సొంత లాభం కొంత మానుకొని పొరుగువానికి సాయపడవోయి అనే మాటలను ప్రభుత్వం స్వీకరించి అభివృద్ధి చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. తన రచనల ద్వారా దేశ భక్తిని పెంపొందించాలని 161 ఏళ్ల క్రితమే జాతికి దిశా నిర్దేశం చేసిన వ్యక్తి గురజాడ అని, ఇటీవల దేశ ప్రధాని మోడీ గారి నోట గురజాడ మాటలు వినిపించాయని గుర్తు చేశారు. అనేక మంది సందర్శకులు లైబ్రరీకి వస్తున్న దృష్ట్యా వారి సౌకర్యార్ధం లైబ్రరీలో మౌలిక వసతుల కల్పనకు జిల్లా పరిషత్‌ నుండి నిధులను సమకూర్చనున్నట్లు చైర్మన్‌ తెలిపారు. అందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఏమేమి అవసరం అవుతాయో నివేదిక తయారు చేయాలని కలెక్టర్‌ను కోరారు. జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ.. గురజాడ చిర స్మరనీయులని, వారి రచనలు ఎన్ని తరాలకైనా అనుసరనీయమని, ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. గురజాడ గహాన్ని ఇటీవలే పెయింటింగ్స్‌ వేయించి కొంత మేరకు అబివృద్ధి చేయడం జరిగిందని, అందుకు అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గురజాడ గృహంలో గురజాడ వినియోగించిన వస్తువులను , గురజాడ స్టాంప్‌ను చేతి రాతలను, కళ్ళద్దాలను, గురజాడ సేకరించిన పుస్తకాలను , ఎక్సిబిషన్‌ రూమ్‌లో గురజాడ సమకాలీన కవులు, మేధావుల చిత్ర పటాలను చైర్మన్‌, కలెక్టర్‌ సందర్శించి, విజిటర్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేసి గురజాడ గృహాన్ని సందర్శించినందుకు గర్వంగా ఉందని రాశారు. గోల్డెన్‌ హెరిటేజ్‌ అఫ్‌ విజయనగరం వారి వితరణతో గురజాడ గహం లో సందర్శకుల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన ఆర్‌.ఓ ప్లాంట్‌ను కూడా చైర్మన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ విజయలక్ష్మి, సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, మున్సిపల్‌ కమీషనర్‌ శ్రీరాములు నాయుడు, జిల్లా పర్యాటక అధికారి లక్ష్మి నారాయణ, డిఐపి.ఆర్‌ఓ దున్నా.రమేష్‌ , తహసిల్దార్‌ కోరాడ శ్రీనివాస రావు, గురజాడ సమాఖ్య ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్‌, సూర్య లక్ష్మి, గోపాల రావు, కృష్ణా జిల్లా సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌, విద్యార్ధులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.