Sep 18,2023 09:03
  • నేటి నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

ప్రజాశక్తి -న్యూఢిల్లీ బ్యూరో : ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఆదివారం నాడిక్కడ పార్లమెంట్‌లోని లైబ్రరీ భవన్‌లో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టాలని మెజార్టీ రాజకీయ పార్టీలు బలంగా లేవనెత్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లును ప్రవేశపెట్టాలని, ఏకాభిప్రాయంతో ఆమోదం పొందేలా చూడాలని వివిధ పార్టీల నేతలు కోరారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలన్న పార్టీల డిమాండ్‌పై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. కాశ్మీర్‌లో ప్రాణత్యాగం చేసిన భద్రతా దళాల సిబ్బందికి అఖిలపక్ష సమావేశంలో నివాళులర్పించినట్టు మంత్రి తెలిపారు.సిపిఐ (ఎం) ఎంపి వి శివదాసన్‌ మాట్లాడుతూ 'కార్మికులు, రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలపై చర్చించాలి. ఎన్‌టిసి మిల్లు కార్మికులు జీతాలు లేకుండా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను విడిగా పరిగణించాలి. కొత్త పార్లమెంటు భవనంలో ఉపరాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేసినట్టు ప్రకటన హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. భారతదేశ వైవిధ్యాన్ని పూర్తిగా తిరస్కరించే ఇలాంటి వైఖరిని సరిదిద్దాలి' అని డిమాండ్‌ చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ.. హిందీ అంశాన్ని మిగతా 5లో పరిశీలిస్తామని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ ఇది పార్లమెంటు సాధారణ సమావేశమని ప్రభుత్వం తమకు తెలియజేసిందని తెలిపారు. ''దాని ఉద్దేశం ఏమిటో ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. ఇది ఏదైనా కొత్త ఎజెండాతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది'' అని ఆయన అన్నారు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, చైనాతో సరిహద్దులో పరిస్థితి వంటి అంశాలను సమావేశంలో తమ పార్టీ ప్రస్తావించిందని చెప్పారు.
            అఖిలపక్ష సమావేశంలో రక్షణ శాఖ మంత్రి, లోక్‌సభ ఉపనేత రాజ్‌ నాథ్‌ సింగ్‌, రాజ్యసభ నేత, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూశ్‌ గోయల్‌, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, సహాయ మంత్రులు అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, వి.మురళీధరన్‌, మాజీ ప్రధాని హెచ్‌డి దేవగౌడ (జెడిఎస్‌), ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), వైకో (ఎండిఎంకె), అధిర్‌ రంజన్‌ చౌదరి, ప్రమోద్‌ తివారీ (కాంగ్రెస్‌), తిరుచ్చి శివ, కనిమొళి (డిఎంకె), డెరిక్‌ ఓబ్రెయిన్‌ (టిఎంసి), శివదాసన్‌ (సిపిఐ (ఎం)), బినరు విశ్వం (సిపిఐ), వి. విజయసాయి రెడ్డి (వైసిపి), కె. రామ్మోహన్‌ నాయుడు, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌ (టిడిపి), కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు (బిఆర్‌ఎస్‌), ప్రఫుల్‌ పటేల్‌ (ఎన్‌సిపి అజిత్‌ పవర్‌ వర్గం), వందన చౌహాన్‌ (ఎన్‌సిపి శరద్‌ పవర్‌ వర్గం), రామ్‌ గోపాల్‌ యాదవ్‌, ఎస్‌టి హాసన్‌ (ఎస్పీ), పినాకి మిశ్రా, సస్మిత్‌ పాత్ర (బిజెడి), మనోజ్‌ ఝా (ఆర్‌జెడి), లలన్‌ సింగ్‌ (జెడియు), సంజరు సింగ్‌ (ఆప్‌), తంబిదొరై (అన్నాడిఎంకె) పాల్గొన్నారు.
 

                                                                           ఇదే ఎజెండా

తొలిరోజు 75 ఏళ్ల పార్లమెంట్‌ చరిత్రపై చర్చ జరగనుంది. మంగళవారం కొత్త పార్లమెంటు భవనానికి సమావేశాలు మారనున్నాయి. దీనికి ముందు ఎంపీల గ్రూప్‌ ఫోటో సెషన్‌ ఉంటుంది. మంగళవారం గణేశ చతుర్థి ప్రత్యేక పూజల అనంతరం కొత్త పార్లమెంట్‌ భవనంలో ఉదయం 11 గంటలకు సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇచ్చిన అంశాల కంటే వేరే ఎజెండా లేదని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం ప్రకటించలేదు. కొత్త పార్లమెంటుకు వెళ్లడం, వివాదాస్పద ఎన్నికల కమిషన్‌ బిల్లుతో సహా ఐదు బిల్లులను పరిగణనలోకి తీసుకోవడం ఎజెండాగా ఉంది. అఖిలపక్ష సమావేశంలో సర్క్యులేట్‌ చేసిన బిల్లుల్లో ఎన్నికల సంఘం సభ్యులను నియమించే అధికారం కేంద్రానికి పూర్తిగా కల్పించే బిల్లును చేర్చలేదు. ఈ బిల్లును పరిగణనలోకి తీసుకోవడం లేదా అని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించగా.. పరిశీలిస్తున్నామని బదులిచ్చారు. పోస్టాఫీసు బిల్లు, న్యాయవాదుల సవరణ బిల్లు, ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు వంటి బిల్లులను కూడా ప్రత్యేక సెషన్‌లో చర్చిస్తారు.