Sep 10,2022 06:52

భారతదేశం వందవ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పేదలకు స్వంత భూమిని కలిగి ఉండే విధంగా...ఉచిత విద్య, విద్యుత్తు, తాగు నీరు... మంచి ఉద్యోగం, మంచి వేతనాలు... సరసమైన మార్కెట్లను అందుబాటులోకి తెచ్చే స్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నాను. ఏ విధమైన లింగ వివక్షను ఎదుర్కొనకుండా చదువుల్లో రాణించే పిల్లలను కలిగి ఉండే భారతదేశాన్ని కోరుకుంటున్నాను. స్త్రీ పురుషులిరువురూ పరస్పర గౌరవ భావంతో కలిసిమెలసి ఉండే దేశాన్ని... మహిళలపై ఏ విధమైన లైంగిక దాడులు జరగనటువంటి దేశాన్ని కోరుకుంటున్నాను. ఎలాంటి మత ఘర్షణలు జరగనటువంటి భారతదేశాన్ని ఆశిస్తున్నాను.

నం డెబ్బై ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న ఈ తరుణంలో...భారతదేశం 1947లో ఎలా ఉన్నది? గడచిన డెబ్బై ఐదేళ్ళలో దేశంలో ఏవిధమైన మార్పులు వచ్చాయి? వందవ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఎలా ఉండాలి? వంటి అంశాలను ఆలోచించాల్సి ఉంటుంది.
     మనకు స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో సామ్రాజ్యవాద బ్రిటన్‌ ... భారత దేశాన్ని పేద దేశంగా మార్చి వెళ్ళిపోయింది. దేశవ్యాప్తంగా భూస్వామ్య విధానం ఆధిపత్యంలో ఉంది. నాడు భూస్వామ్య విధానపు అత్యంత నీచమైన రూపంగా కుల వ్యవస్థ ఉంది. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఉంటుందనీ, భూస్వామ్య విధానం, దానికి అనుబంధంగా ఉండే కుల వ్యవస్థ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతాయని మనందరం విశ్వసించాం. మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా మార్చేందుకు ప్రయత్నించారు. భారతదేశం సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉంటుందని మన రాజ్యాంగ ప్రవేశిక తెలియచేస్తున్నది.
     దేశ పౌరులందరికీ సమానమైన అవకాశాలను సమకూర్చడమే ప్రజాస్వామ్యం యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్య్రం అనంతరం మానవ వనరుల అభివృద్ధిలో, పేదరిక నిర్మూలనలో, సంతోష సూచికలో దేశం చాలా వెనుకబడి ఉంది. ధనవంతులు మరింత ధనవంతులుగా మారారు. పేదలు పేదలుగానే మిగిలిపోయారు. లేదా నిష్ట దారిద్య్రం అంచులకు నట్టివేయబడ్డారు.
     స్వాతంత్య్రానంతరం భూస్వామ్య, కుల వ్యవస్థలను నిర్మూలించాల్సి ఉంది. నాడు భూసంస్కరణలు, వ్యవసాయిక సంబంధాలలో విప్లవం లాంటివి అవసరమైన అంశాలుగా ఉన్నాయి. కానీ అవి జరగలేదు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు అభివృద్ధికి అవసరమైన ముడి పదార్థాలు లభ్యమయ్యే సారవంతమైన భూములు అనేకం మనకున్నాయి. వాటిని సేకరించవచ్చు. ప్రజల భాగస్వామ్యంతో, ప్రభుత్వ పర్యవేక్షణలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాల వృద్ధి జరగలేదు.
     స్త్రీల పట్ల వివక్షను ప్రదర్శిస్తూ, స్త్రీలను ద్వేషించే ధోరణులను ప్రోత్సహించే సాంప్రదాయ వైఖరులు, అమానవీయ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడే చట్టాలను ప్రభుత్వాలు చేయవచ్చు. తద్వారా ఉజ్వల భవితగల దేశాన్ని నిర్మించవచ్చు. మతం పేరుతో అమానవీయ ఆచార, సంప్రదాయాలు కొనసాగడానికి అనుమతించకూడదు. ఉదాహరణకు, మతం మద్దతు ఉన్నప్పటికీ అమానవీయ ఆచారం అన్న కారణంగా బ్రిటీష్‌ వారు సతీసహగమనాన్ని రద్దు చేశారు. కానీ, జవహర్‌లాల్‌ నెహ్రూ లాంటి నేతలు కలలుగన్న శాస్త్రీయ విలువలు కలిగిన దేశాభివృద్ధికి మనం దిశా నిర్దేశం చేయలేకపోయాం. ఇప్పుడు స్వయం ప్రకటిత మెజారిటీ మతం ఆజ్ఞాపిస్తే, దేశంలో మిగిలినవారు అనుసరించే పరిస్థితికి చేరుకున్నాం. భారతదేశం ప్రస్తుతం అప్రజాస్వామిక, అలౌకిక మార్గంలో నడుస్తున్నది.
     ఏ ప్రజాస్వామిక దేశం కూడా విస్మరించలేని ఒక ఆదర్శం లౌకికవాదం. భారతదేశంలో ప్రధానంగా ఐదు లేదా ఆరు మతాలు, దాదాపు 6000 కులాలు, సుమారు 1600 భాషలు ఉన్నాయి. ఒకవేళ 'ఏకత్వం'తో కూడిన ఈ 'భిన్నత్వాన్ని' మనం అంగీకరించకుంటే, ఒక దేశంగా మనం వైఫల్యం చెందడం ఖాయం. నేడు దేశంలో, భిన్నత్వం అనేది కేవలం మన రాజ్యాంగంలో మాత్రమే ఉంది, ఆచరణలో లేదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఓట్లు మరియు అధికారం కోసం కులమతాలను ఉపయోగించుకోవడం సర్వసాధారణం అయిపోయింది.
    మన రాజ్యాంగంలో పేర్కొన్న భారతదేశం భిన్నమైనది. వందవ స్వాతంత్య్ర దినోత్సవ దిశగా పయనిస్తున్న ఈ తరుణంలో మన ముందున్న కఠోరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వుంది. అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువగా పేద ప్రజలు...ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన మహిళలు ఉన్నారు. శ్రామిక శక్తిలో భారతీయ మహిళలు కేవలం 23 శాతంగా ఉన్నారు. అందులో సైతం వారు అసమాన వేతనాల వివక్షతను ఎదుర్కొంటున్నారు. మిగిలిన మహిళలంతా ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత మహిళలకు కల్పించిన 33 శాతం రిజర్వేషన్ల వల్ల వారు క్షేత్ర స్థాయి రాజకీయ సంస్థల్లోకి ప్రవేశించగలిగారు. తమ సమస్యలపై గొంతెత్తి చాటేందుకవి ఉపయోగపడ్డాయి. జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలు, వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రాతినిధ్యం ద్వారా అధికార పదవులను చేపట్టాలి. అభివృద్ధి సూచికలలో భారతదేశం కన్నా వెనుకబడి ఉన్న దేశాల్లోని ప్రభుత్వాలు, రాజకీయ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం మనకంటే మెరుగ్గా వుంది.
     ఒక ప్రజాస్వామిక దేశానికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్ష్యం సోషలిజం. ప్రతీ పౌరుడు ఎటువంటి వివక్షను ఎదుర్కొనకుండా పని చేసే వీలు కల్పించి, దేశ నిర్మాణానికి అవకాశం కల్పిస్తుంది సోషలిజం. లింగ, సామాజిక హోదాతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరినీ సమానంగా చూసే వ్యవస్థే సోషలిస్టు వ్యవస్థ. ఈ వ్యవస్థ కోసం ప్రభుత్వం ప్రగతిశీలమైన చట్టాలను తీసుకు రావాలి. కార్యనిర్వాహక శాఖ ఈ చట్టాలను అమలు చెయ్యాలి. న్యాయ వ్యవస్థ వాటికి మద్దతుగా నిలవాలి. ఇది భారతదేశంలో వాస్తవ రూపం దాల్చాలి.
     నేను వామపక్ష రాజకీయాలకు, కేరళలో అనేక పర్యాయాలు అధికారం చేపట్టిన భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్టు)కి చెందిన వ్యక్తిని. ఒక రాష్ట్రాన్ని పాలించడానికి ఎన్నుకోబడిన పార్టీ, సమాఖ్య రాజ్యాంగానికి లోబడి కొంత మేరకు మాత్రమే ప్రజలకు సేవలు అందించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ... రాష్ట్రంలో భూమి, విద్య, వైద్యానికి సంబంధించిన సంస్కరణలు చేపట్టిన కారణంగానే కేరళ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నది. మానవ వనరుల అభివృద్ధి, జీవన ప్రమాణాలు (వాస్తవ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ) అనేక ఇతర రాష్ట్రాల కంటే కేరళలో చాలా ఉన్నత స్థానంలో ఉన్నాయి. ఈ ప్రమాణాలను కొనసాగించాలంటే మొత్తం దేశమంతటా సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించే దిశగా పని చేయాల్సి ఉంటుంది. లేకుంటే అనేక మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడతారు.
       వందవ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి లింగ వివక్షత లేని, కుల వ్యవస్థ అంతమైన, లౌకిక దేశంగా భారత్‌ ఉండాలి. అది దేశంలోని భిన్నత్వాన్ని చూసి గర్వపడే పౌరులను సృష్టించగలగాలి. ప్రజలు కులం, మతం లేదా భాష లాంటి అంశాల ఆధారంగా విభజింపబడకూడదు. సంస్కృతిని పెంపొందించడానికి భాష అత్యంత ముఖ్యమైనది. కానీ ప్రతీ భాషకు సమానమైన గౌరవం ఇవ్వాలి. ప్రజలు తమ మత విశ్వాసాలను ఆచరించవచ్చు కానీ వారు ఇతర మతాలను అగౌరవ పరచకూడదు. కాలానుగుణంగా మారేందుకు వారు సిద్ధంగా ఉండాలి.
     వందవ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి భావప్రకటనా స్వేచ్ఛను హరించని భారతదేశాన్ని కోరుతున్నాను. మతపరమైన తీవ్రవాదులకు ఏమాత్రం వెరవక ప్రజలు తమ భావాలను వ్యక్తీకరించడానికి అనుమతించే దేశాన్ని ఆశిస్తున్నాను.
     భారతదేశం వందవ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పేదలకు స్వంత భూమిని కలిగి ఉండే విధంగా...ఉచిత విద్య, విద్యుత్తు, తాగు నీరు... మంచి ఉద్యోగం, మంచి వేతనాలు...సరసమైన మార్కెట్లను అందుబాటులోకి తెచ్చే స్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నాను. ఏ విధమైన లింగ వివక్షను ఎదుర్కొనకుండా చదువుల్లో రాణించే పిల్లలను కలిగి ఉండే భారతదేశాన్ని కోరుకుంటున్నాను. స్త్రీ, పురుషులిరువురూ పరస్పర గౌరవ భావంతో కలిసిమెలసి ఉండే దేశాన్ని... మహిళలపై ఏ విధమైన లైంగిక దాడులు జరగనటువంటి దేశాన్ని కోరుకుంటున్నాను. ఎలాంటి మత ఘర్షణలు జరగనటువంటి భారతదేశాన్ని ఆశిస్తున్నాను. చివరగా, మన రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా లౌకిక, సోషలిస్టు, ప్రజాస్వామిక భారతదేశాన్ని నేను కోరుకుంటున్నాను.

(వ్యాసకర్త : కేరళ పూర్వ ఆరోగ్య శాఖామంత్రి)
'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' సౌజన్యంతో
కె.కె. శైలజ

కె.కె. శైలజ