
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పరిశ్రమాధిపతులకు ప్రభుత్వాలు పలు మినహాయింపులు, రాయితీలు ఇచ్చాయి. దాంతో పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, లోపాలను గుర్తించి, వాటిని సరిచేయించే సమున్నత ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకే పరిశ్రమల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. కార్మిక భద్రత, ప్రమాణాలు పాటించడానికి, ప్రమాద సమయంలో కార్మికులు చనిపోకుండా బయటపడే పరికరాలు సరఫరా చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. చట్టపరంగా పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన యాజమాన్యాలు, వాటిని ఖర్చుగా చూస్తున్నాయి. తమ లాభాల శాతం తగ్గిపోతున్నట్లుగా భావిస్తున్నాయి.
పరిశ్రమకు విస్తృతార్ధం వుంది. ఓ పరిశ్రమ ఉత్పత్తి ప్రక్రియ మానవుని శ్రమపై ఆధారపడినట్లే, ఓ పరిశ్రమ ఏర్పాటులో మానవుని త్యాగాలు ఎన్నో వున్నాయి. ఎంతోమంది రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను కోల్పోతారు. కొన్నేళ్ల నుంచి కలిసిమెలిసి బతికే మనుషులు నిర్వాసితులై చెల్లాచెదురవుతారు. వ్యవసాయాధారిత చేతివృత్తుల కుటుంబాల జీవనోపాధి దెబ్బ తింటోంది. ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది జీవితాలు శిథిలమైతే తప్ప, నష్టాన్ని చవిచూస్తే తప్ప పారిశ్రామిక ప్రగతికి పునాదులు పడవు. పారిశ్రామికోత్పత్తి ప్రక్రియ జరగడానికి ముందు, తరువాత మనిషి త్యాగం, శ్రమ వుందన్న విషయం పెట్టుబడిదారీ వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది. లాభం కోసం అమానవీయ అంశాలను ముందుకు తెచ్చి మానవీయ విలువలను, శ్రమను, మనిషి ప్రాణాలను అప్రధానమైనవిగా భావిస్తోంది. ఈ చులకన, హేయమైన భావనలో నుంచి మనిషిని మనిషిగా చూడ్డం, గౌరవించడం, ప్రేమించడం అనే నైతికత నశించి... తానెదగడానికి, లాభాలు పోగేసుకోవడానికి ఎంతటి నీచానికైనా దిగజారుతున్న పరిస్థితులను తరచూ చూస్తున్నాం. చట్టపరమైన ఉల్లంఘనలు, యాజమాన్య నిర్లక్ష్యమే పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోవడానికి, గాయాలపాలు కావడానికి దారితీస్తున్నదన్న వాస్తవాన్ని అర్ధంచేసుకోవాలి.
పారిశ్రామికాభివృద్ధి పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమాధి పతులకు కల్పిస్తున్న వెసులుబాట్లు ప్రమాదాలు పెరగడానికి ఒక హేతువుగా మారాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పరిశ్రమాధిపతులకు ప్రభుత్వాలు పలు మినహాయింపులు, రాయితీలు ఇచ్చాయి. దాంతో పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, లోపాలను గుర్తించి, వాటిని సరిచేయించే సమున్నత ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకే పరిశ్రమల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. కార్మిక భద్రత, ప్రమాణాలు పాటించడానికి, ప్రమాద సమయంలో కార్మికులు చనిపోకుండా బయటపడే పరికరాలు సరఫరా చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. చట్టపరంగా పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన యాజమాన్యాలు, వాటిని ఖర్చుగా చూస్తున్నాయి. తమ లాభాల శాతం తగ్గిపోతున్నట్లుగా భావిస్తున్నాయి. తమ లాభాలకు మూలం కార్మికుల శ్రమన్న వాస్తవాన్ని గ్రహించ నిరాకరిస్తున్నాయి.
పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఐదేళ్లలో జరిగిన 119 ప్రమాదాల్లో 120 మంది కార్మికులు చనిపోయారు. 68 మంది గాయపడ్డారు. గతేడాది 24 కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో 20 మంది మృతి చెందారు. 18 మంది వికలాంగులయ్యారు. పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల తీవ్రతకు ఇవి అద్దం పడుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మృతిచెందిన కార్మిక కుటుంబాలకు పరిహారం చెల్లించే ఒక పద్ధతిని యాజమాన్యాలు అనుసరిస్తున్నాయి గానీ పరిశ్రమల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఖర్చు చేయడానికి ఇష్టపడ్డంలేదు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు యాజమాన్యాలు విలువ ఇవ్వడంలేదు.
విశాఖనగరంలో 2020 మే 7న ఎల్.జి పాలిమర్స్లో జరిగిన ప్రమాదంలో 15 మంది మరణించారు. దక్షిణ కొరియాకు చెందిన బహుళజాతి సంస్థ ఎల్.జి పాలిమర్స్ యాజమాన్యం నుంచి మృతుల కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియో ఇప్పించింది. ఎంత డబ్బు ఇచ్చినా పోయిన ప్రాణాలు తిరిగిరావు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల బాధలు తీరవు. కుటుంబాలకు పెద్దదిక్కుగా వున్న వారు, విద్యార్థులు, ప్రమాదం నుంచి తప్పించుకోలేక ఊపిరాడక చనిపోయిన వృద్ధులు ఇలా వివిధ వయస్సుల వారు చనిపోయారు. ఈ మరణాలకు, అనేక మంది అస్వస్థతకు గురై ఆస్పత్రులపాలై ఆరోగ్యాలు కోల్పోవడానికి కారణమైన యాజమాన్యంపై చర్యల్లేవు. మనిషి తలకు విలువ కట్టే ఈ వ్యవస్థలో బహుశా ఇంతకంటే మెరుగైన, ప్రగతిదాయక ఆలోచనలు పరిశ్రమాధిపతుల బుర్రల్లో మొలకెత్తుతాయని ఆశించలేము. పరిశ్రమ అనగానే డబ్బులు పోగు చేసుకొనే యంత్రాంగంగా యాజమాన్యం భావించినంత కాలం మనిషి శ్రమకు, ప్రాణాలకు విలువ వుండదు. ప్రమాదాలు ఎల్.జి పాలిమర్స్, పరవాడ ఫార్మా కంపెనీల్లోనూ, అచ్యుతాపురం సెజ్ లోని పరిశ్రమలకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని రసాయన, మందుల పరిశ్రమల్లోనూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. హెచ్పిసిఎల్లో జరిగిన ప్రమాదంలో 12 మంది, స్టీల్ప్లాంట్ లోని ఎస్ఎంఎస్2 లోని ఆక్సిజన్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 12 మంది చనిపోయారు. ప్రమాదం ఏ పరిశ్రమలో ఎప్పుడు జరిగినా కార్మికులు చనిపోతూనే వున్నారు. ఈ చావులకు కారణం యాజమాన్యాల నిర్లక్ష్యమేనని ప్రమాదనంతరం జరిగిన నివేదికల్లో బట్టబయలవుతున్నాయి. పరిశ్రమలో భద్రత, కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వడంలో చూపుతున్న అలసత్వాన్ని నివేదికలు ఎత్తిచూపుతున్నాయి. అయినా పరిశ్రమాధిపతుల వైఖరిలో మార్పు రావడంలేదు. భద్రతను పట్టించుకోవడంలేదు. పైగా ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులపై నెపం నెట్టి తప్పించుకొనే ప్రయత్నాలు యాజమాన్యాలు చేస్తున్నాయి.
తన నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదానికి కార్మికులు చనిపోయారన్న అసలు విషయాన్ని దాచిపెట్టి, చనిపోయిన కార్మిక కుటుంబానికి ఎక్స్గ్రేషియో చెల్లించడాన్ని గొప్ప ఉదారతగా యాజమాన్యాలు ప్రచారం చేసుకుంటున్నాయి. నాణ్యమైన రియాక్టర్లు ఏర్పాటు చేయడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు ప్రమాద స్థలం నుంచి తప్పించుకొని పారిపోయి ప్రాణాలు కాపాడుకొనేందుకు అనువైన వాతావరణాన్ని పని ప్రదేశంలో యాజమాన్యాలు కల్పించడంలేదు. పరిశ్రమలో ప్రమాదం ముందుగానే గుర్తించి హెచ్చరించే ఆధునిక అలారం వ్యవస్థ లేదు. ఫైర్ సిస్టమ్ సరిగా లేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ లేదు. పరిశ్రమల్లో అంతర్గత ప్రమాదాలకు ఇవి కారణమౌతుండగా, పర్యావరణ సమస్యలతో పరిసర ప్రాంత ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
పరిశ్రమలు ఏర్పాటు చేసే వరకు సమీప ప్రాంత ప్రజలను సొంత మనుషుల్లా చూసు కుంటామని చెప్పిన యాజమాన్యాలు, హామీ ఇచ్చిన ప్రభుత్వాలు తరువాత ఆ ప్రజల బాధలు వినడంలేదు. పరవాడ ఫార్మా సిటీకి ఆనుకొనివున్న తాడిని తరలిస్తామని ఎన్నికల హామీ ఇవ్వడం తప్ప తరలించి వారి బాగోగులను పట్టించుకోవడంలేదు. కంపెనీల వల్ల కలుషితమైన భూగర్భ జలాలను తాగలేక...పరవాడ, లంకెలపాలెం నుంచి వాటర్ క్యాన్లు కొనుక్కోవాల్సిన దుస్థితి తాడి వాసులకు ఏర్పడింది. రసాయన, ఔషధ పరిశ్రమ వున్న ప్రతీ చోటా ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. పరిశ్రమలను ప్రోత్సహించే పేరిట మానవ, పర్యావరణ విధ్వంసాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. తనకు కంపెనీలో జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్న యాజమాన్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడంతో కనీస వేతనాలు అమలు కావడంలేదు. వారి భద్రతను పట్టించుకోవడంలేదు. ప్రమాదాలు జరిగినప్పుడు బర్నింగ్వార్డు సహా అత్యవసర వైద్య సేవలు అందించేలా పారిశ్రామిక ప్రాంతంలో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మించాలి. కార్మికుల ప్రాణాలు కాపాడే చర్యలు చేపట్టాలి.
గతేడాది అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ అపెరల్ సిటీ లోని సీడ్స్ వస్త్ర పరిశ్రమలో రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు విష వాయువులు లీకయిన ఘటనలో వందలాది మంది మహిళా కార్మికులు ఆస్పత్రుల పాలయ్యారు. పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి)...ఆస్పత్రుల్లో చికిత్స పొందిన కార్మికునికి లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, పర్యావరణ పరిరక్షణకు రూ.10కోట్లు కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని ఇచ్చిన తీర్పును యాజమాన్యం పట్టించుకోని పరిస్థితి వుంది. కోర్టు తీర్పులు అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతులు కట్టుకొని యాజమాన్యం వద్ద నిలబడేలా ప్రభుత్వ విధాన నిర్ణయాలున్నాయి. పరిశ్రమల్లో కార్మికుల భద్రత, సమీప ప్రజల ఆరోగ్య బాధ్యత యాజమాన్యాలు తీసుకొనేలా కార్మికులు, ప్రజలు ఐక్యంగా పోరాడాలి. నిర్వాసిత కుటుంబ సభ్యుల విద్యార్హత ఆధారంగా ఉపాధి కల్పించేలా ఒత్తిడి తేవాలి. భద్రత పాటించని కంపెనీల జాబితాను బహిర్గత పర్చాలి. నిర్దిష్ట కాలపరిమితిలో లోపాలను సరిచేయని కంపెనీల రిజస్ట్రేషన్ రద్దు చేయాలి.
(వ్యాసకర్త అనకాపల్లి జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి,
సెల్: 9490300010)
జి. కోటేశ్వరరావు