
- అచ్యుతానందన్ జీవిత కథ 'ఎ సెంచరీ ఆఫ్ స్ట్రగుల్'ను ఆవిష్కరించిన పినరయి విజయన్
తిరువనంతపురం : ప్రముఖ కమ్యూనిస్టు నేత, మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ వందేళ్లు పూర్తి చేసుకుని 101వ వసంతంలోకి శుక్రవారం అడు గిడారు. ఈ సందర్భంగా తిరువనంత పురంలోని అయ్యంకాళి హాలులో ఆయన జీవిత కథ 'సెంచరీ ఆఫ్ స్ట్రగుల్'ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆవిష్కరించారు. దర్శకుడు షాజీ ఎన్ కరుణ్ పుస్తకాన్ని అందుకున్నారు. రచయిత కె.వి.సుధాకరన్ రాసిన ఈ పుస్తకాన్ని చింతా పబ్లిషర్స్ ప్రచురించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రతో ముడిపడివున్న విఎస్ జీవితాన్ని ఈ పుస్తకంలో చక్కగా వివరించారని తెలిపారు. గతంలో వచ్చిన పుస్తకాలు అలా లేవని, పార్టీ నుంచి విడదీసి విఎస్ను ప్రత్యేకంగా చూపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఎనిమిది దశాబ్దాలుగా విఎస్ ప్రజల పక్షాన చురుగ్గా పనిచేశారని తెలిపారు. 96 ఏళ్ల వయసులో అనుకోకుండా కొన్ని శారీరక సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు.