- లాంగ్ జంపులో మొదటి స్థానం సాధించిన మానస
ప్రజాశక్తి-తుగ్గలి (కర్నూలు) : తుగ్గలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మానస కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన లాంగ్ జంప్ పోటీలలో మొదటి స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ చందు నాయక్ మంగళవారము విలేకరులకు తెలిపారు. ఈనెల 12న జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఈ పోటీలు జరగాయని అందులో లాంగ్ జంప్ లో మొదటి స్థానం సాధించిన మానస రాష్ట్రస్థాయి లాంగ్ జంప్ పోటీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. పల్నాడులో జరిగే జూనియర్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వారు తెలిపారు.గత రెండు సంవత్సరాల నుండి తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వివిధ పోటీలలో తమ ప్రతిభను కనపరచడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలను అలవాటు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను కోరారు. ఈ ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయులు జయలక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్ మల్లికార్జున, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.










