Mar 25,2023 07:26

వ్యవసాయ కార్మికుల నిజ వేతనాలు కాలానుగుణంగా పెరగడం లేదు. ఇంతకు ముందు పేర్కొన్నట్లు, నయా ఉదారవాద విధానాల ప్రభావం వల్ల భూమి లేని, ఇళ్ళు లేని వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సాంఘిక సంక్షేమ రాజ్యం క్షీణించడంతో వ్యవసాయ కార్మికుల జీవితాలు మరింత అనిశ్చితంగా, అభద్రతాయుతంగా మారుతున్నాయి. వ్యవసాయ కార్మికులకు తగిన పని, సరైన పని పరిస్థితులు, వేతనాలు, సామాజిక భద్రతా చర్యలకు హామీ ఇచ్చే సమగ్ర కేంద్ర చట్టం కోసం డిమాండ్‌ చేసే కీలక సమయమిది. వ్యవసాయ కార్మికులు తమ ఉనికి కోసం  పోరాటం చేయడం తప్ప వేరే మార్గం లేదు.

ఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు), అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌), సిఐటియు నిర్వహిస్తున్న మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌ ర్యాలీకి కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు లక్షల సంఖ్యలో ఢిల్లీకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూడు సంఘాలు గత కొన్నేళ్ళుగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉమ్మడి పోరాటాల్ని నిర్వహిస్తున్నాయి. మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌ ర్యాలీ ఒక కీలకమైన సమయంలో జరుగుతున్నందున అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. దీన్ని విజయవంతం చేయడానికి దేశ వ్యాప్తంగా భారీగా జరుగుతున్న ఏర్పాట్లలో ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములవుతున్నారు.
       కాంగ్రెస్‌ నాయకత్వంలోని గత ప్రభుత్వాలు అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లో అసంతృప్తిని మిగిల్చాయి. పెట్టుబడిదారీ విధానం లక్షణమైన అవినీతి చాలా విశృంఖలంగా ఉండేది. ఈ పరిస్థితుల్ని అవకాశంగా తీసుకొని, పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి బిజెపి అధికారం చేజిక్కించుకుంది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. అయితే, బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవే నయా ఉదారవాద విధానాలను కొనసాగించడమే కాక వాటి అమలును కూడా వేగవంతం చేస్తున్నది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం కార్పోరేట్లకు కట్టుబడి ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా కోవిడ్‌-19 మహమ్మారి వ్యాపిస్తున్న కష్ట కాలంలో నయా ఉదారవాద విధానాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం ముమ్మరం చేసింది.
        స్వాతంత్య్రోద్యమ కాలంలో సమాజంలోని భిన్న వర్గాల ప్రజల సమస్యలు, డిమాండ్లు లేవనెత్తబడ్డాయి. బ్రిటిష్‌ పాలన నుండి స్వాతంత్య్రం సాధించడంతో పాటు ప్రజా సమస్యలను స్వతంత్ర భారత దేశంలో పరిష్కరించాలని కూడా స్వాతంత్య్రోద్యమ నాయకులు చర్చించారు. ఈ చర్చ భారత రాజ్యాంగ రూపకల్పనకు సహాయపడింది. స్వాతంత్య్రోద్యమ విలువలను వారసత్వంగా పొందిన ఈ రాజ్యాంగం సమానత్వ సూత్రాల ఆధారంగా దేశ నిర్మాణానికి పూచీ పడింది. ఈ సందర్భంగానే స్వాతంత్య్రం తరువాత అనేక చట్టాలు, సంస్థలు, పథకాల ఏర్పాటు జరిగింది. కానీ అవి నిజమైన స్ఫూర్తితో అమలు కాలేదు. అయినప్పటికీ, మన హక్కులను రాతపూర్వకంగా రాజ్యాంగం ద్వారా సాధించాం. ఆ రాజ్యాంగమే మన పోరాటాలకు ఆధారం. కార్మికవర్గం, రైతాంగం, గ్రామీణ కూలీల సంరక్షణ హామీ కోసం అనేక చట్టాలు చేశారు. సాంఘిక సంక్షేమ రాజ్య నిర్మాణాన్ని నెలకొల్పారు. అయితే కార్మికవర్గ సంరక్షణా చట్టాల్ని నీరుగార్చే క్రమంలో బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్రోద్యమ విలువలకు వ్యతిరేకంగా పని చేస్తూ, సాంఘిక సంక్షేమ రాజ్య నిర్మాణాన్ని ధ్వంసం చేస్తున్నది. ఈ బిజెపి ప్రభుత్వం...డెబ్భై సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశం సాధించిన అభివృద్ధిని నాశనం చేస్తూ, భారతదేశ కార్మికవర్గం చెమటోడ్చి నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థల్ని కారుచౌకగా అమ్ముతున్నది.
      బిజెపి ప్రభుత్వ కార్పోరేట్‌ అనుకూల విధానాలు శ్రామికులకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఓవైపు కార్పోరేట్లు అధిక లాభాల్ని గడిస్తుంటే సామాన్య ప్రజలు పొట్టకూటి కోసం పోరాటాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా నిరంతర వ్యవసాయ సంక్షోభం, భారీ స్థాయిలో నిరుద్యోగం నెలకొనడంతో దినసరి కూలీలు, వ్యవసాయ కార్మికులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితికి నెట్టబడ్డారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో-2021 లెక్కల ప్రకారం వ్యవసాయ రంగంలో పని చేస్తున్న 10,881 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2014 నుండి దినసరి వేతన జీవుల ఆత్మహత్యలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2021లో నమోదైన 1,64,033 మంది ఆత్మహత్యా బాధితుల్లోని ప్రతీ నలుగురిలో ఒకరు దినసరి వేతన కూలీ అని ఎన్‌సిఆర్‌బి తాజా నివేదిక పేర్కొంది.
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, భారత ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. దానితోపాటు సాంఘిక సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడం లేదు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కు 2.72 లక్షల కోట్ల రూపాయల కేటాయింపు డిమాండ్‌ ఉండగా ప్రభుత్వం కేవలం 60 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం నేరం.
     మోడీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని కార్పోరేట్‌ శక్తులు లూటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ అనేక చట్టాల్ని సవరిస్తున్నది. లేదా కొత్తగా చట్టాల్ని తెస్తున్నది. ప్రస్తుత కార్మిక చట్టాల్ని నీరుగార్చేందుకు, దారి మళ్ళించడానికి తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లు, ప్రభుత్వం నుండి ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా కార్మికవర్గాన్ని దోపిడీ చేయడానికి కార్పొరేట్లకు కల్పించే పూర్తి స్వేచ్ఛ తప్ప మరొకటి కాదు. మూడు వ్యవసాయ చట్టాల్ని కూడా ఈ విధమైన లక్ష్యంతోనే తీసుకొచ్చారు. ఇది వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ల ప్రవేశానికి చేసే ప్రయత్నమే. ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేసి, కార్పోరేట్లకు ఆహార మార్కెట్‌ను తెరవడమే ఈ కొత్త చట్టాల లక్ష్యం.
     శ్రామికులు స్వాతంత్య్రోద్యమం సాధించిన విజయాలను ఎలా కోల్పోతున్నారో చెప్పడానికి గడిచిన కొన్ని దశాబ్దాల్లో భూసంస్కరణలు ఎలా తలకిందులయ్యాయో ఉదాహరణగా చెప్పొచ్చు. స్వాతంత్య్రోద్యమ పోరాటానికి లక్షల సంఖ్యలో గ్రామీణ శ్రామికుల్ని ఆకర్షించిన ప్రధాన నినాదాల్లో ''దున్నే వానికి భూమి'' నినాదం ఒకటి. అయితే స్వాతంత్య్రానంతరం పాలకవర్గం ప్రజల్ని వంచించింది. కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర, జమ్మూ కాశ్మీర్‌ మినహా దేశంలో ఎక్కడా భూసంస్కరణల్ని అమలు చేయలేదు.
         నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా భారతీయ సమాజంలో అసమానతలు పెరుగుతున్నాయి. ధనవంతులు, కార్పోరేషన్లు మరింత ధనవంతులుగా మారుతుంటే పేద ప్రజలు బతుకుదెరువుకు అవసరమయ్యే వేతనాల కోసం పోరాటాలు చేస్తున్నారు. విద్య, వైద్యం వంటి ప్రాథమిక ప్రభుత్వ సేవలు వారికి అందుబాటులో లేకుండా పోయాయి. ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం 40 శాతం పైగా భారతదేశ సంపద జనాభా లోని కేవలం 1 శాతం మంది చేతిలో కేంద్రీకృతమై ఉంది. మన దేశంలో 10 మంది సంపన్నుల సంపద 2022లో 27.52 లక్షల కోట్లు పెరిగింది. దీనికి భిన్నంగా జనాభాలో దిగువనున్న 50 శాతం ప్రజలు మొత్తం సంపదలో కేవలం 3 శాతం సంపద మాత్రమే కలిగి ఉన్నారు. 2021లో 102 మందిగా ఉన్న బిలియనీర్ల సంఖ్య 2022 నాటికి 166కి పెరిగింది. ప్రపంచంలో అధికంగా దాదాపు 23 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో పేదరికంలో జీవిస్తున్నారు. పైనున్న 10 శాతం వారితో పోలిస్తే, దిగువనున్న 50 శాతం మంది ప్రజలు, 10 శాతం వారు చెల్లించే పన్నుల కన్నా 6 రెట్లు పరోక్ష పన్నులు చెల్లిస్తున్నారు.
         ఆహారం, ఆహారేతర నిత్యావసరాల నుండి వసూలైన మొత్తం పన్నుల్లో దిగువనున్న 50 శాతం ప్రజలు 64.3 శాతం చెల్లిస్తున్నారు.
         అదేవిధంగా దేశంలో అన్ని రంగాలు దాడికి గురవుతున్నాయి. బిజెపి కుల, మత, అస్తిత్వ రాజకీయాల ఆధారంగా శ్రామికుల మధ్య అనైక్యతను సృష్టిస్తున్నది. భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన హిందూత్వ ఎజెండాను కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా అమలు చేస్తున్నది. భారతీయ సమాజంలో హిందూత్వ ప్రాజెక్టును రుద్దేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఉపయోగిస్తున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసి, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత గల వ్యక్తులే దానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్‌ విభజన లాంటి చర్యలు రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాల ఉల్లంఘనలను సూచిస్తున్నాయి.
        ఫాసిస్ట్‌ భావజాలంతో ఉన్న ఏ ప్రభుత్వమైనాసరే అసమ్మతిని, భిన్న స్వరాల్ని సహించదు. అవి ఏ రూపంలో వున్నా శిక్షిస్తుంది. దురదృష్టవశాత్తు మనం దీనిని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతీయ సమాజంలో చూస్తున్నాం. అనేకమంది పౌరహక్కుల కార్యకర్తలు, ప్రజా నాయకులు, వామపక్ష ఉద్యమ నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాడులు చేస్తున్నాయి. ఎలాంటి చార్జి షీట్లు లేకుండా అనేకమంది సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు. ప్రధానమంత్రికి, తన సహచరులకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిపక్ష పార్టీల నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో బలిపశువులు అవుతున్నారు. భారతదేశంలో ఎన్నుకోబడిన నిరంకుశ ప్రభుత్వముందని అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయి.
         మైనారిటీలు, దళితులు, గిరిజనులే లక్ష్యంగా నిత్యం హింసలకు పాల్పడుతున్నారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ప్రభుత్వ పెద్దలు పథకం ప్రకారం ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. మనుస్మృతి ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి దళితులకు వ్యతిరేకంగా ఒక పద్ధతి ప్రకారం హింసను సృష్టిస్తున్నారు. దళితులకు వ్యతిరేకంగా నమోదవుతున్న నేరాల సంఖ్య పెరుగుదలలో ఇది ప్రతిబింబిస్తుంది. రిజర్వేషన్లపై కూడా తీవ్రమైన దాడి జరుగుతున్నది. అణగారిన వర్గాల వారికి బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతలు విధిస్తున్నారు. మతోన్మాద, కులోన్మాద హింసలకు బాధ్యులైన వారు వీధుల్లో స్వేచ్ఛగా విహరించేందుకు వీలు కల్పిస్తున్నారు. అంతేగాక వారి చర్యల్ని సమర్థిస్తూ బహిరంగ వేదికలపై వారిని సన్మానిస్తున్నారు. సమాజంలో అణగారిన వర్గాల వారికి అభద్రతా భావాన్ని కలిగించే విధంగా దేశంలో ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
         వ్యవసాయ రంగ నిరంతర సంక్షోభం వ్యవసాయ కార్మికుల్ని కష్టాల పాల్జేస్తున్నది. కొనసాగుతున్న ఈ వ్యవసాయ సంక్షోభం చిన్న సన్నకారు రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నది. కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వ్యవసాయ పనిదినాలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా వ్యవసాయ కార్మికుల్లో నిరుద్యోగం పెరిగి గ్రామీణ నిరుద్యోగులు, ఇతర పేదలు వలస పోతున్నారు. ఆర్థిక సంక్షోభం ఫలితంగా మందగించిన పారిశ్రామిక వృద్ధి ఈ ప్రజలకు ప్రత్యామ్నాయ గ్రామీణ, పట్టణ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైంది. వ్యవసాయ కార్మికుల నిజ వేతనాలు కాలానుగుణంగా పెరగడం లేదు. ఇంతకు ముందు పేర్కొన్నట్లు, నయా ఉదారవాద విధానాల ప్రభావం వల్ల భూమి లేని, ఇళ్ళు లేని వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సాంఘిక సంక్షేమ రాజ్యం క్షీణించడంతో వ్యవసాయ కార్మికుల జీవితాలు మరింత అనిశ్చితంగా, అభద్రతాయుతంగా మారుతున్నాయి. వ్యవసాయ కార్మికులకు తగిన పని, సరైన పని పరిస్థితులు, వేతనాలు, సామాజిక భద్రతా చర్యలకు హామీ ఇచ్చే సమగ్ర కేంద్ర చట్టం కోసం డిమాండ్‌ చేసే కీలక సమయమిది. వ్యవసాయ కార్మికులు తమ ఉనికి కోసం పోరాటం చేయడం తప్ప వేరే మార్గం లేదు.
       ఈ పరిస్థితుల్లో మన జీవనాధారాల్ని కాపాడుకోవడమే కాక లౌకిక, ప్రజాస్వామ్య, భిన్నత్వంతో కూడిన భారతదేశాన్ని రక్షించుకోవడం కూడా మనందరి బాధ్యత. ఇవే ప్రస్తుతం కార్మికవర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్ళు. సామాజిక సంపద సృష్టికర్తలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ఐక్య పోరాటాలే దీనికి సరైన సమాధానం.

(వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి)
బి. వెంకట్‌

బి. వెంకట్‌