Sep 12,2022 10:48

జెనీవా : ప్రతి 44 సెకన్లకు ఒక కరోనా మరణం నమోదు అవుతోందని, కరోనా మహమ్మారి మానవాళిని పూర్తిగా విడిచిపెట్టలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) ఆయా దేశాల్ని హెచ్చరించింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా.. పపంచంలో ఇప్పటికీ ప్రతి అర నిమిషానికి ఒకరు వైరస్‌ కారణంగా చనిపోతున్నారని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన కార్యదర్శి అథనోం గేబ్రియెసెస్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా, మరణాలు మాత్రం అదేస్థాయిలో ఉన్నాయి. వైరస్‌ ప్రభావంపై వస్తున్న నివేదికలు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే ఇదే ట్రెండ్‌ ఇకపై ఉంటుందని గట్టిగా చెప్పలేం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కరోనా మరణాల సంఖ్య 80శాతం వరకు తగ్గాయి. ఇలాంటి పరిస్థితిలోనూ ప్రతి 44 సెకన్లకు ఒక వ్యక్తి కోవిడ్‌తో చనిపోతున్నాడు. ఇది అత్యంత ప్రమాదకర సంకేతం'' అని తెలిపారు. కోవిడ్‌ మరణాలను అడ్డుకోవచ్చునని, కోవిడ్‌ జాగ్రత్తలు కొనసాగించాలని ఆయా దేశాల పౌరులకు ఆయన సూచించారు. ''కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు..పోలేదు..పోలేదు అని పదే పదే చెబుతున్నాను. ఈ మాట నా నుంచి విని..విని...మీరు విసిగి చెంది వుండొచ్చు. వైరస్‌ పూర్తిగా మనల్ని విడిచిపోలేదు అనేందుకు కచ్చితమైన సమాచారముంది'' అని గేబ్రియెసెస్‌ హెచ్చరించారు. మహమ్మారిని ఎదుర్కోవటంపై అనుసరించాల్సిన వైద్య విధానంపై డబ్ల్యూహెచ్‌వో త్వరలో ఒక ప్రకటన చేయనున్నది. వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంతగా అడ్డుకోవాలని ఆయా దేశాల్ని డబ్ల్యూహెచ్‌వో కోరుతోంది.