Apr 28,2023 07:45

       'జైహింద్‌' అనే నినాదాన్ని ఆర్‌.ఎస్‌.ఎస్‌, జనసంఫ్‌ు, బిజెపి వారెవరూ సృష్టించలేదు. దేశభక్తి, దేశభక్తి - అని గొంతులు ఎండిపోయే విధంగా అరచి గీపెడుతున్న వారికి ఎవరికీ ఆ ఆలోచనే రాలేదు. దేశం గర్వించదగ్గ ఏ చిన్న పనీ వారు చేసింది లేదు. అయితే, మరి ఆ పని ఎవరు చేశారూ? జైహింద్‌ - అనే మాటను ఎవరు వాడుకలోకి తెచ్చారూ? అవి, స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న రోజులు ! సుభాష్‌ చంద్రబోస్‌ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని రూపొందించుకున్న రోజులు. ఆ ఆర్మీలో దేశంలోని భిన్న ప్రాంతాల వారు ఉండేవారు. పరిచయస్తులు, మిత్రులు ఎవరైనా కలిస్తే వారు వేరు వేరు రకాలుగా అభివాదం చేసుకునేవారు. కొందరు 'నమస్కార్‌' అని, మరికొందరు 'రామ్‌ రామ్‌' అని, ఇంకొందరు 'అస్సలాము అలైకుం' అని సంభోదించుకునేవారు. సుభాష్‌ చంద్రబోస్‌ సెక్యులర్‌ భావాలు కలిగిన వాడు గనక, తన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (ఆర్మీ)లో ఇన్ని రకాల పలకరింపు (విష్‌)లు ఉండటం ఆయన ఇష్టపడలేదు. దేశభక్తి ఉట్టిపడేలా, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా అందరూ ఒకేరకంగా పలకరించుకోవాలని ఆయన కోరుకున్నారు. అందుకు ఒక మాటను, లేదా నినాదాన్ని రూపొందించమని మిత్రులకు, తన ఆర్మీలో ఉన్న ముఖ్యులకు సూచించారు.
           అలా ఎందరో ఎన్నెన్నో రకాలైన మాటలు సూచించారు. తన నేషనల్‌ ఆర్మీలో మేజర్‌గా పనిచేసే ఒక వ్యక్తి ఒకరోజు వచ్చి - ఒకరికొకరు ఎదురు పడ్డప్పుడు 'హలో' అని పలకరించుకోవాలని సూచించాడు. సుభాష్‌ చంద్రబోస్‌కు అది నచ్చలేదు. ఒకరికొకరు అభివాదం చేసుకోవడానికి ఎలాంటి మాట కావాలో బోస్‌ అతనికి మరొకసారి వివరించాడు. అంతే...ఆ మేజర్‌ మరో రెండు మాటలు చెప్పాడు. ఒకటి 'జై హిందుస్థాన్‌' అని, మరొకటి 'జైహింద్‌' అని. వినగానే జైహింద్‌-అన్నది బోస్‌కు బాగా నచ్చింది. చిన్న మాటయినా అది బలంగా ఉందనిపించింది. జైహింద్‌-అంటే భారతదేశానికి జయము కలుగుగాక అని అర్థం. అప్పటి స్వాతంత్య్రోదమ కాలానికి అది బాగా సరిపోతుందని అనుకున్నారు బోస్‌. అదే జైహింద్‌ అనే మాటను తన నేషనల్‌ ఆర్మీలో ప్రవేశపెట్టారు. ఆ మాటలో స్వాతంత్య్రం సంపాది స్తామన్న ఆత్మవిశ్వాసం ఉంది. దేశభక్తి ఉంది. పలకడానికి సుళువుగా ఉంటూనే, మనోబలాన్ని పెంచే శక్తి కూడా ఆ మాటలో ఉంది. సుభాష్‌ చంద్రబోస్‌ అన్నీ బాగా ఆలోచించి తన ఉపన్యాసాలలో కూడా ఆ మాట తరచూ ఉపయోగించేవారు. ఆ విధంగా 'జైహింద్‌' అనతి కాలంలో ఒక జాతీయ నినాదం అయ్యింది.
            ఇంతకూ 'జైహింద్‌'కు రూపకల్పన చేసిన ఆ నేషనల్‌ ఆర్మీ మేజర్‌ ఎవరూ? అంటే - ఆయన మన హైదరాబాదు వాడే. పేరు ఆబిద్‌ హసన్‌ సఫ్రానీ. చిన్నప్పటి పేరు జైనుల్‌ ఆబిదీన్‌ హసన్‌. చిన్నప్పుడే ఆనాటి శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. దానితో చదువు ఆగిపోయింది. కొంతకాలం తర్వాత ఇంజనీరింగ్‌ చదువుదామని జర్మనీ వెళ్ళాడు. అక్కడే నేతాజీని కలుసుకున్నాడు. అప్పుడు బోస్‌ జర్మనీలోనే ఉన్నారు. అప్పుడే ఆబిద్‌ జీవితం మలుపు తిరిగింది. చివరి దశలో ఉన్న ఇంజనీరింగ్‌ కోర్సు వదిలేసి, బోస్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా చేరాడు. అప్పటికే జర్మన్‌ భాషపై కొంత పట్టు సాధించడం వల్ల, జర్మన్‌ భాష అనువాదకుడిగా కూడా నేతాజీకి సహాయపడ్డాడు. ఇండియాకు తిరిగి వచ్చాక ఇక్కడ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ )లో 1942-45 మధ్య ఆబిద్‌ హసన్‌ మేజర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఐ.ఎఫ్‌.ఎస్‌ (ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసు) సాధించాడు. 1948-1969 మధ్య కాలంలో డెన్మార్క్‌కు, ఆ తర్వాత ఈజిప్టుకు భారత రాయబారిగా సేవలు అందించాడు. 1984 ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌ లోనే తన డెబ్బయి రెండవ యేట కన్నుమూశాడు. జీవితాన్ని దేశభక్తికి అర్పించిన మహోన్నతుడిగా నిలిచిపోయాడు.
     మధ్యలో కొంతకాలం కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్నా అందులో ఎక్కువ కాలం ఉండలేదు. దేశ విభజన జరిగి పాకిస్థాన్‌ విడిపోయిన తర్వాత ఐఎఫ్‌ఎస్‌ పూర్తిచేయడానికి తన పూర్తి సమయం కేటాయించాడు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు కార్యదర్శిగా ఉన్న రోజుల్లో ఆబిద్‌ ఆయన వెన్నంటే ఉండేవారు. ఆయన నౌకలో ఏ దేశం వెళ్ళినా, వెంట వెళుతూ ఆయనను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునేవాడు. తర్వాత కాలంలో నేతాజీకి ఆబిద్‌ హసన్‌కు చుట్టరికం కూడా కలిసింది. నేతాజీ మేనల్లుడు అరబిందో బోస్‌ - ఆబిద్‌ హసన్‌ అన్న కూతురు సురయా హసన్‌ను పెళ్లి చేసుకున్నాడు.
           సైన్యంలో మేజర్‌ గాను, విదేశాలలో భారత రాయబారి గానూ పనిచేయడమే గాక, ఆబిద్‌ హసన్‌కు ఉరుదూ, పర్షియన్‌ కవిత్వమంటే చాలా చాలా ఇష్టంగా ఉండేది. విశ్వకవి 'జనగణమన' గీతాన్ని ఆయన హిందుస్థానీ లోకి అనువదించాడు. హిందీ-ఉర్దూలు కలిసి ఏర్పడిందే హిందూస్థానీ భాష. ''శుఖ్‌ సుఖ్‌ చైన్‌ కి బార్‌ ఖా బర్‌ సే''గా అది చాలా ప్రాచుర్యం పొందింది. దానికి కెప్టెన్‌ రామ్‌సింగ్‌ ఠాకూరి సంగీతం సమకూర్చాడు. అయితే అది మిలట్రీ మార్చింగ్‌ సాంగ్‌లా ఉంటుంది. దీనికి కూడా మళ్ళీ ఒక ప్రాధాన్యత ఉంది. 15 ఆగస్టు 1947న దేశానికి స్వాతంత్య్రం లభించిన మరునాడే నాటి తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఎర్రకోట మీద మువ్వన్నెల జెండాను ఎగరేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంలో ఆ కార్యక్రమానికి కెప్టెన్‌ ఠాకూరిని ఆయన మ్యూజిక్‌ బ్యాండ్‌ని నెహ్రూ ఆహ్వానించారు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారి ఎర్రకోట దగ్గర ఆబిద్‌ హసన్‌ గీతం, కెప్టెన్‌ ఠాకూరి సంగీత సారథ్యంలో ప్రపంచానికి వినిపించడం జరిగింది. ఆబిద్‌ హసన్‌ సఫ్రానీ 'జనగణమన' గీతాన్ని హిందుస్థానీ లోకి అనువదించాడు. భావం, లయ ఏమాత్రం చెడకుండా అద్భుతంగా ఆవిష్కరించాడు.
           గత చరిత్ర లోంచి ఎలుగెత్తి సగర్వంగా చెప్పుకోవాల్సిన ఇలాంటి ఘట్టాలు మనం చెప్పుకోం! అనవసరమైన వాటికి ప్రాధాన్యమిస్తుంటాం!! ఇక సమకాలీనంలోనైతే అవివేకపు అంశాలే ఎంతో ప్రాధాన్యమైనవిగా ప్రభుత్వ పెద్దలు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. నిజాయితీగా ఆలోచించగల వారికి మాత్రమే ఈ విషయం బోధపడుతుంది!
 

/ వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త /

దేవరాజు మహారాజు