
సోదర సోదరీ మణులారా! వినండి. ఇప్పుడు నేను హిందువును కాదు. అస్పృశ్యుణ్ణీ కాదు. నేనొక విముక్త మానవుణ్ణి. ఒక స్వేచ్ఛా జీవిని. హాని కలిగించే ఈ దుష్ట వ్యవస్థకు బానిసను కాను. నేనిప్పుడు 'ధమ్మ దీక్ష' తీసుకున్నాను గనక, నా శేష జీవితం బౌద్ధ ధమ్మాన్ని ప్రచారం చేయడానికి వినియోగిస్తాను. బుద్ధుడి వెలుగులు మానవాళికి అందించడానికి నిబద్ధుడనై ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను.
డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న నాగ్పూర్లో బౌద్ధం స్వీకరించారు. అది జరిగి ఇప్పటికి 66 ఏళ్లు. ఆయన తనతో పాటు ఆరు లక్షల మంది అనుచరుల్ని, అనుయాయుల్ని బౌద్ధంలోకి మార్చారు. వారంతా ఇప్పుడు 'నియో బుద్దిస్టులు'గా గుర్తింపు పొందారు. గతంలో ఉన్న మహాయానం, హీనయానం శాఖల్లాగ వీరిది 'నవయానం' శాఖ అయ్యింది. ప్రపంచాన్ని మానవీయ సమాజంగా తీర్చిదిద్దగలది కేవలం బౌద్ధమే అన్నది అంబేద్కర్ భావన! తను బౌద్ధం స్వీకరించి, ఈ దేశ వాసులకు ఒక మంచి సందేశం ఇచ్చాననీ - ఒక మంచి మార్గాన్ని చూపించానని ఎంతో ఆత్మ విశ్వాసంతో హుందాగా ప్రకటించారు.
కళింగ యుద్ధం తర్వాత, చక్రవర్తి అశోక మౌర్య పరివర్తనకు లోనయ్యాడు. విజయదశమి నాడు ఆయుధాలు త్యజించి బౌద్ధం స్వీకరించాడు. అందుకే అది 'అశోక విజయ దశమి' అయ్యింది. బౌద్ధ చక్రవర్తిగా ఆయన ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు. ఆ స్ఫూర్తితోనే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కుశీనగర్కు చెందిన బర్మా బౌద్ధ భిక్షువు మహస్తవీర్ చంద్రమణి ద్వారా బౌద్ధం స్వీకరించారు. ఆ రోజు ఆయన ప్రజల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగ సారాంశం ఈ విధంగా ఉంది... నిజానికి అది ప్రపంచాన్ని ఉద్దేశించి చేసినట్టుగా ఉంది.
''ప్రియమైన నా సోదర సోదరీమణులారా !
నేను హిందూ ధర్మాన్ని త్యజించి భగవాన్ బుద్ధుడి శరణుజొచ్చాను. బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించాను. ఇది జ్ఞానం, సమానత్వం, కరుణ, సదాచారాల మీద ఆధారపడి ఉంది.
సోదర సోదరీమణులారా! వినండి. ఇప్పుడు నేను హిందువును కాదు. అస్పృశ్యుణ్ణీ కాదు. నేనొక విముక్త మానవుణ్ణి. ఒక స్వేచ్ఛా జీవిని. హాని కలిగించే ఈ దుష్ట వ్యవస్థకు బానిసను కాను. నేనిప్పుడు 'ధమ్మ దీక్ష' తీసుకున్నాను గనక, నా శేష జీవితం బౌద్ధ ధమ్మాన్ని ప్రచారం చేయడానికి వినియోగిస్తాను. బుద్ధుడి వెలుగులు మానవాళికి అందించడానికి నిబద్ధుడనై ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను.
సోదర సోదరీమణులారా! నాతో పాటు బుద్ధ ధమ్మాన్ని స్వీకరించాలనుకున్న వారు లేచి నిలబడి, నాతోపాటు ప్రమాణం చేయండి...' అని అంబేద్కర్ అనగానే, మైదానంలో కూర్చున్నవారంతా లేచి నిలబడి ఆయన చెప్పిన మాటలు వారు కూడా ఉచ్ఛరించి ప్రమాణం చేశారు.
- నేను బుద్ధ భగవానుడు చెప్పిన పది నీతి సూత్రాల్ని అనుసరిస్తాను.
- నేను అన్ని జంతువుల పట్ల కరుణతో వ్యవహరిస్తాను.
- నేను మనుషులందరినీ సమానులుగా భావిస్తాను.
- జన్మతో, కుటుంబ నేపథ్యంతో వచ్చిన మతాన్ని, ధర్మాన్ని త్యజిస్తున్నాను. అది ప్రగతి నిరోధకంగా ఉండి నా జీవితాన్ని దు:ఖమయం చేసిందని గ్రహించాను. అందుకే బౌద్ధం స్వీకరించి, బుద్ధుడి శరుణజొచ్చాను.
- మనుషుల్ని హీన దృష్టితో చూసే ధర్మాన్ని త్యజించి, మానవీయ విలువల్ని నిలిపే బౌద్ధం స్వీకరించి స్వేచ్ఛా మానవుణ్ణి అవుతున్నాను. దీనితో నాకు కొత్త జన్మ లభించినట్లుగా భావిస్తున్నాను.
- ఇక నుండి హిందూ దేవీదేవతలను పూజించను.
- హిందూ కర్మకాండను అనుసరించను. మూఢనమ్మకాలను నమ్మను. వ్యాప్తి చేయను.
- ఈ రోజు నుండి బుద్ధుడు చెప్పిన మూడు సిద్ధాంతాలు - ప్రజ్ఞ - సన్మార్గం - కరుణ - జీవితాంతం తప్పక పాటిస్తాను. అవే నాకు మార్గదర్శకాలవుతాయి!
- బుద్ధం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ధమ్మ దీక్ష తీసుకున్న ఆ స్థలానికి 'దీక్షా భూమి' అనే పేరు స్థిరపడింది. విషాదమేమంటే దీక్ష తీసుకున్న తర్వాత కేవలం నలభై అయిదు రోజుల వ్యవధిలో అంబేద్కర్ కన్నుమూశారు (డిసెంబర్ 6, 1956). అయితే ఆయన మరణానంతరం మార్చి 1959లో ఇరవై మిలియన్ల మంది బౌద్ధం స్వీకరించారు. తరువాత కాలంలో అంబేద్కర్ స్మారక సమితి ఏర్పడి, 1968-78 మధ్యకాలంలో అక్కడ నాలుగు ఎకరాల స్థలంలో ఒక పెద్ద స్థూపం నిర్మించారు. అది నాగపూర్ లోని రామ్దాస్పేట్ ప్రాంతం. ప్రస్తుతం దాన్ని అభయంకర్ నగర్ అని పిలుస్తున్నారు. ఆ స్థూపం ప్రపంచం లోనే అతి పెద్ద బోలు స్థూపం. అందులో రెండు అంతస్థులు ఉన్నాయి. అందులో కొన్ని వందల మంది బౌద్ధ భిక్షువులు ఉండగలిగే విధంగా నిర్మించారు.
డాక్టర్ అంబేద్కర్ ఈ ధమ్మ దీక్ష నాగపూర్ లోనే ఎందుకు తీసుకున్నారు? నాగపూర్ ఆర్ఎస్ఎస్ వారికి ప్రధాన కేంద్రం. వారి ప్రభావం తగ్గించడానికా? హిందూ మత ప్రభావంతో ఆర్.ఎస్.ఎస్, గతంలో అల్లర్లు సృష్టించి దేశ విభజనలో ప్రధాన పాత్ర పోషించింది. అందువల్ల, కావాలనే అంబేద్కర్ వారిని దెబ్బ తీయడానికి నాగపూర్ను ఎంచుకున్నారని ఒక వాదన ముందుకొచ్చిన మాట వాస్తవమే! కానీ.. అసలు విషయం అది కాదు. అసలు నాగపూర్కు ఆ పేరు ఎందుకొచ్చిందో తెలుసుకోవాలి. ఆ ప్రాంతంలో నాగజాతి ప్రజలు ఉండేవారు. వారంతా బౌద్ధులు. కుట్రలు, కుతంత్రాలు వారికి తెలియదు. వలస వచ్చిన ఆర్యులకు వీరు బలయ్యారు. నాగజాతి ప్రజలు అధిక సంఖ్యలో నివసించిన ఊరు గనక అది నాగపూర్ అయ్యింది. అక్కడికి దగ్గరలో ప్రవహించే నది పేరు నాగానది. బౌద్ధానికి ఆ ప్రాంతానికి విడదీయరాని బంధం ఉన్నందువల్ల అంబేద్కర్ ఆ నాగపూర్ను ఎంచుకున్నారు. ఇదే విషయం విలేకరులు అడిగినప్పుడు తనకు ఆర్.ఎస్.ఎస్ వారి విషయం స్పృహ లోకే రాలేదన్నారు.
అంబేద్కర్ ధమ్మ దీక్ష తీసుకుని, లక్షల మందిని బౌద్ధులుగా మార్చడం 'హిందూ సంప్రదాయ వాదులకు నచ్చలేదు. అంబేద్కర్ మెహర్లను (మహారాష్ట్ర దళితులు) తప్పు దోవ పట్టిస్తున్నాడని, వారి జీవితాలతో ఆడుకుంటున్నాడని - వారికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు దక్కకుండా అడ్డుకుంటున్నాడని, దళితులపై ప్రేమాభిమానాలు ఉన్నట్లు గగ్గోలు పెట్టారు. ముఖ్యంగా లోకమాన్యుడనని చెప్పుకున్న బాలగంగాధర్ తిలక్ తన పత్రిక ''కేసరి''లో అంబేద్కర్ గురించి అవాకులు చవాకులు రాయించాడు. అసెంబ్లీ - పార్లమెంట్లలో కూడా మెహర్లు తమ స్థానాల్ని వదులుకోవాల్సి వస్తుందని, వారిని రెచ్చగొట్టారు. అంబేద్కర్ నింపాదిగా ఓపికగా అన్ని ప్రశ్నల్ని తిప్పికొట్టారు. తన జాతి వారికి ఎలా మేలు చేయాలో తనకు తెలుసునని, కావాలంటే బ్రాహ్మణులను మోహర్లుగా మార్చి, రిజర్వేషన్లో ఉన్న ఉద్యోగాలు, అసెంబ్లీ, పార్లమెంట్లో ఉన్న రిజర్వుడు స్థానాలు తీసుకోవచ్చని అన్నాడు. చనిపోయిన జంతువుల కళేబరాలు మెహర్లు ముట్టుకోవద్దని అంబేద్కర్ పిలుపునిచ్చినప్పుడు కూడా హిందూ సంప్రదాయవాదులు గోల చేశారు. దానికి అంబేద్కర్ ఇచ్చిన జవాబు వారి నషాళానికి ఎక్కింది. ''మీ ఇళ్ళలో మీ వాళ్ళు చనిపోతే మీరే పాడె మోసుకుంటున్నారు కదా? అలాగే మీ పశువుల్ని మీరే ఎత్తేసుకోండి. పశువుల చర్మం, మాంసం, ఎముకల మీద వచ్చే ఆదాయం మా జాతి ప్రజలు వదిలేస్తున్నారు. ఆ ఆదాయం కూడా బ్రాహ్మణుల్నే సంపాదించుకోనీయండి!'' అన్నాడు. వర్ణాశ్రమ ధర్మాల్ని తిప్పికొట్టి, మనుషులుగా ఎవరి హక్కుల్ని వారు సాధించుకున్నప్పుడే సమ సమాజ నిర్మాణం జరుగుతుంది - అని నమ్మినవాడాయన !
'హిందువుగా పుట్టాను. కానీ, హిందువుగా మరణించను' అని నాసిక్ దగ్గర 1935 అక్టోబర్ 13న జరిగిన కాన్ఫరెన్స్లో అంబేద్కర్ తన చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించినప్పుడు ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. తన 'ధమ్మ దీక్ష'తో అన్నింటికీ ఆయన సరైన సమాధానం చెప్పారు. దేశ ప్రజలకు దిశా నిర్దేశం చేశారు.
/ వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త/
డా|| దేవరాజు మహారాజు