
గడిచిన ముప్పరు ఏళ్లలో మన చుట్టూ చాలా మార్పులొచ్చాయి. అప్పటిదాకా నెమ్మదిగా మనం ఎదుగుతున్నట్టే- పరిసరాల్లోనూ నింపాదైన మార్పులుండేవి. మనకు కనిపిస్తూ, వినిపిస్తూ, మన అంచనాలకు, అభిప్రాయాలకు అందుతూ సాగేవి. ప్రపంచీకరణ మొదలయ్యాక- మార్పుల్లో పెను తుపాను వేగం అందుకొంది. అనేకం కుదేలైపోయాయి. అనేకం కొత్తవి వచ్చి చేరాయి. ఎవరి కోసమో, ఎందుకోసమో తెలియని అయోమయం జనసామాన్యంలో ఆవరించి ఉండగానే- మార్పు శరవేగంతో సాగిపోతూనే ఉంది. జీవితాల్లో, జీతాల్లో, జీవన విధానంలో, మానవ సంబంధాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అవి మనుషుల మీద చూపించే ప్రభావం ఎలా ఉంది? మానవ సహజ ఉద్వేగాలకు, అవసరాలకు ... ఈ కొత్త వరవడి సృష్టించిన పెను వేగానికి మధ్య సంఘర్షణ, సమన్వయం ఎలా కుదురుతోంది? ఇలాంటి సున్నితమైన అంశాలను కథలుగా మలచటం చాలా పరిశీలనతో చేయాల్సిన పని. శ్రీఊహ తాజాగా వెలువరించిన తన 'ఇసుక అద్దం', ఇతర కథల్లో అలాంటి ప్రయత్నం చేశారు.
కథలు ఊహాల్లోంచి పుట్టవు. జీవితమే కథలకు ఆధారం. రచయిత్రి శ్రీఊహ ఆ మాటే చెప్పారు : 'సాఫీగా సాగిపోతున్న ఐటీ జీవితం నుంచి హఠాత్తుగా బయటకు రావాల్సి వచ్చింది. ఆ సంఘటన గురించి కథ రాయడం, దానికి మంచి స్పందన రావడంతో నా ఆలోచనలు కొత్తకోణం వైపు అడుగులు వేశాయి.' ఆ అడుగులూ, ఆలోచనలూ నిజ జీవితాల పరిశీలన మీదుగా సాగాయి. జరిగిన దానిని ఆ క్రమంలోనే, అదే విధంగానే రాస్తే వార్తవుతుంది. ఆ జరగటం వెనక ఏఏ కారణాలు ఉండి ఉంటాయో అన్వేషిస్తే, ఆలోచిస్తే, సరిగ్గా అన్వయించి, పాత్రోచితంగా చెప్పగలిగితే మంచి కథలు పుడతాయి. శ్రీఊహలో ఆ పరిశీలనా శక్తి, మానవీయ దృక్పథం, కథన నైపుణ్యం పుష్కలంగా ఉన్నాయి. కాబట్టే- తన దృష్టికి వచ్చిన ఒక్కో సంఘటనా ఒక్కో కథై ఈ సంపుటిలో చోటుచేసుకొంది.
మహిళలు సాధించిన, సాధిస్తున్న ప్రగతి గురించి ఈరోజు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అన్ని పని ప్రాంతాల్లోనూ వారు కనిపిస్తారు. మరి ఆ పని ప్రాంతాలు మహిళలకు అనుకూలంగా ఉంటున్నాయా? అంటే అవునని జవాబు చెప్పలేం. ఈ సంపుటిలోని తొలి కథ 'వాష్' చదువుతున్నప్పుడు చాలా సంగతులు తెలిసొస్తాయి. పీరియడ్స్ సమయంలో, ఇతర సందర్భాల్లో ఉద్యోగినులు ఎదుర్కొనే అసౌకర్యం, అననుకూలత కళ్లకు కడతాయి. ఇంట్లోని చీర కనపడకుండా పోయిందని బాధపడాలా, అది పనావిడ కూతురి పెళ్లి చీరగా మారినందుకు సంతోషించాలా? అన్న సందిగ్ధంలోంచి పుట్టిన కథ 'ఎర్రచీర'. పనావిడను దొంగగా చిత్రీకరించటంగా కాక, ఆమె అవసరాల్లోంచి మనల్ని ఆలోచించేలా తీర్చిదిద్దటం ఈ కథ ప్రయోజకత్వం. అట్టడుగు జీవితాల జీవన వెతల్ని అత్యంత దగ్గర పట్టి చూపించిన కథ.. 'శివ అంటే ఈడే ..'. హుస్సేన్సాగర్లో దూకి చనిపోవాలనుకునే వాళ్లను, చనిపోయినవాళ్లను ఒడ్డుకు చేర్చేపని అతడిది. అనాథగా బతికినవాడు అనాథలకు ఆసరాగా నిలుస్తాడు. తన పేరుతో గుర్తింపు కోసం పరితపిస్తాడు. వృత్తిని ప్రేమిస్తాడు. సాగర్లో దూకినప్పుడు మేకు తగిలి, ఒళ్లు చీరుకుపోతే.. అతడు ఆసుపత్రిలో చేరాల్సివస్తే.. 'బాడీని లేపే' పనిని భార్య శాంతమ్మ చేపడుతుంది. అన్నన్ని కష్టాల మధ్యా వాళ్లు జీవితాన్ని ప్రేమించే వైనం ఈ కథకు అంతరాత్మలా వెలుగొందింది. సమకాలీన సమాజంలో 'లావైపోవడం' పెద్ద సమస్యగా మారిపోయింది. ఆ ఇతివృత్తంతో సాగిన కథ 'డబల్ ఎక్సెల్'.. అమ్మమ్మ హిత బోధతో సుఖాంతమవుతుంది. ఈ కథ చెప్పటానికి ఎంచుకున్న పద్ధతి బాగుంది.
'బుజ్జమ్మ మెట్లు' కథ చదూతుంటే చాసో 'లేడీ కరుణాకరణం' గుర్తొచ్చింది. తమ్ముడి ఎదుగుదలకు గర్వమూ, ఆ స్థితిని అనుభవిస్తున్న మరదలు బుజ్జమ్మ పట్ల అసూయా ఏకకాలంలో రేకెత్తుతాయి రత్న, అలివేలులో. ఆ ఎదుగుదలకు కారణం బుజ్జమ్మ ఎవరెవరితోనో సన్నిహితంగా ఉండడమేనని తెలిసి, అగ్గి మీద గుగ్గిలమవుతారు. తమ్ముడికి తెలిసే ఇదంతా జరుగుతుందని నిర్దారణకు వచ్చి, నెమ్మదిస్తారు. 'ఏమీ అడక్కుండా వదిలేస్తామా?' అని అలివేలు అంటే- 'పక్కా అడుగుదాం. నీ కూతురికి ఉద్యోగం, మా ఆయనకు ట్రాన్స్ఫర్..' అంటుంది రత్న. మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తిని వేలెత్తి చూపే కథ ఇది. కార్పొరేట్ ఉద్యోగాల్లో పైపైకి ఎదగటానికి వృత్తి నైపుణ్యం ఒక్కటే సరిపోదు, కాస్త కాకా పట్టే స్వభావం కూడా ఉండాలి. ఆ కళకే అద్భుతమైన పేర్లు కూడా ఉంటాయి. పనికి మాత్రమే పరిమితమై, అలాంటి లౌక్యం ఇష్టంలేని అర్చనకు ఉద్యోగంలో నెగ్గుకు రావడం తలనొప్పిగా తయారవుతుంది. అప్పుడు అమ్మ చెప్పిన మాటలు అద్భుతమైన ధైర్యాన్నిస్తాయి. 'మీ జనరేషన్తో ప్రాబ్లెం ఇదే.. అన్నీ ఒకేసారి సాధించేయాలనే తాపత్రయం. చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. అన్నింటి వెనకా ఒకేసారి పరిగెడితే అలసిపోయేది నువ్వే ..', 'ఇది జీవితం, రేస్ కాదు. ఈ సంవత్సరం ప్రమోషన్ రాకపోతే నిన్ను వెతుక్కుంటూ వచ్చి, ఎవరైనా నిలదీస్తారా? ఆ రేస్లో పడి నువ్వు జీవితంలో చిన్న చిన్న సంతోషాలకు దూరమవుతున్నావు.' అంటుంది తల్లి. ఈ మాటలు అర్చనకే కాదు; ఉరుకుల పరుగుల తరం మొత్తానికి వర్తిస్తాయి. సోషల్ మీడియా, విలాసతత్వం సృష్టిస్తున్న జీవన సంక్షోభాన్ని పరిచయం చేస్తుంది 'నోటిఫికేషన్' కథ. పిల్లలు చెబితే కాదు; చూసి నేర్చుకుంటారు అని ప్రబోధిస్తుంది. చేనేతకు అందించాల్సిన సాయం గురించి 'నెయ్యిబువ్వ'; తరాల మధ్య అంతరాలను, ప్రేమలను 'వడ్డాణం'; పుట్టెడు కష్టాల్లోనూ తోటి మనుషుల గురించి ఆలోచించే వైనాన్ని 'మనిషి అని పిలవనా' కథలు చర్చిస్తాయి.
ఈ పుస్తకానికి శీర్షికగా అమరిన 'ఇసుక అద్దం' ప్రత్యేకమైన ప్రేమ కథ. వయసు చిన్నదైనా అద్భుతమైన పరిణతి, పట్టుదలా ప్రదర్శించే కౌముది; ఆమె ప్రేరణతో ఇజ్జత్ గల మనిషిగా ఎదిగిన శివ ... పాఠకుల మది నిండా నిలిచిపోతారు. దుబారు బుర్జ్ ఖలీఫాలో క్లీనింగ్ పనిలో కుదిరిన శివ క్షణక్షణం కౌముదినే దర్శిస్తాడు. అత్యంత ఎత్తులో క్లీనింగ్ పనిచేస్తున్నప్పుడు ఏదన్నా ప్రమాదం ముంచుకొస్తుందా అన్న ఉత్కంఠ వెంటాడుతుంది. గౌరవప్రదంగా బతకటమే జీవితం, అలా చేయగలిగిందే ప్రేమ అని చెప్పటానికి అత్యంత నైపుణ్యంతో మలచిన కథ ఇది.
గొప్ప సానుకూల దృక్పథంతో సమకాలీన సంఘర్షణలను చిత్రించిన కథలు ఇవి. శ్రీఊహకు ఇది తొలి కథా సంపుటే అయినప్పటికీ - కథను చెప్పటంలో చాలా గొప్ప పరిణతి కనిపిస్తుంది. చిన్న చిన్న మాటలతో కథను వేగంగా నడిపే నైపుణ్యం ముచ్చటగొలుపుతుంది. 'గచ్చిబౌలి.రాళ్లు గుట్టలు, ఇరుకు రోడ్లతో ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉండేది. రాను రాను గుట్టలను అభివృద్ధి మింగేసింది. రోడ్లను వాహనాలు కమ్మేసారు..' అనటంతో రెండు పెద్ద పెద్ద దృశ్యాలు, పరిణామక్రమాలూ మన కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. 'చిలకలు' కథలో వనజక్క కీలకమైనప్పటికీ ఆమెను నేరుగా చూపకుండా కథ చెప్పటం ఒక మేలిమి లక్షణం. 'బుజ్జమ్మ మెట్లు'లోనూ ఇదే తరహా ఎత్తుగడ. 'డైరెక్టడ్ బై వర్మ' ఉత్కంఠభరిత కథ. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఎదురుచూపును కొనసాగిస్తూనే ... తాయెత్తుల తంతులోని మోసకారితనాన్ని బట్టబయలు చేయడం అభినందనీయం. వివిధ ఆధునిక రంగాల్లో పనిచేస్తున్న, ఆధునిక జీవనాన్ని చవిచూస్తున్న యువ కథకులు తాము చూస్తున్న, ఎదుర్కొంటున్న సమస్యలను, సంఘర్షణలను ఇలా కథోపకథలుగా వెలువరించటం మెచ్చదగినది. శ్రీఊహ నిశిత పరిశీలన, కథన కౌశలం, నిర్మాణ నైపుణ్యం భవిష్యత్తులో మరిన్ని మంచి కథలకు ప్రాణం పోస్తాయని బలంగా నమ్మకం కలుగుతోంది.
- సత్యాజీ,
9490099167
ఇసుక అద్దం
రచయిత : శ్రీ ఊహ,
ధర :245/-, పేజీలు : 150
ప్రతులకు : అన్వీక్షికి, నవోదయ,
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.