Jul 05,2023 10:51
  • నాగాలాండ్‌లో నేషనల్‌ హైవే 29పై ప్రమాదం

నాగాలాండ్‌ : నాగాలాండ్‌లో నేషనల్‌ హైవే 29పై మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జోరు వర్షంలో హైవేపై దూసుకెళ్తున్న వాహనాలు కొండచరియలు విరిగిపడడంతో ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇంతలో రోడ్డు పక్కనే ఉన్న కొండ పైనుంచి ఓ భారీ రాయి దొర్లుతూ వచ్చి కారు మీద పడింది. దీంతో కారు వెనుక భాగం మొత్తం నుజ్జునుజ్జుగా మారింది. లోపల కూర్చున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మరొక ప్రయాణికుడు కారుకు, బండరాయికి మధ్య చిక్కుకుపోయాడు. ఇదంతా ఆ కారు వెనక ఆగిన మరో కారు డ్యాష్‌ బోర్డ్‌ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంపై నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నిపూ రియో స్పందిస్తూ.. బాధిత కుటుంబాలకు సానుభూతి  ప్రకటించారు.  మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలంటూ అధికారులను ఆదేశించారు.