
ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రంగరాజన్ వివరించిన ప్రకారం దేశంలో బడా బాబులు చెల్లించాల్సిన మొత్తం 28 లక్షల కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా మిగిలి పోయాయని చెప్పారు. వీరేగాక రూ. 5 వేల కోట్లు, అంతకన్నా తక్కువ బకాయిలు ఉన్నవాళ్లు అనేక మంది ఉన్నారు. ప్రజా ధనంతో లావాదేవీలు జరిపే ఈ బ్యాంకులు బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులతో బంధం ఉన్న వారికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎలా ఇస్తున్నారు? వాటిని వసూళ్ళు చేయలేక, కనీసం వారిని ప్రశ్నించటం కూడా చేతకాక ప్రజాధనాన్ని ప్రభుత్వం ఎలా మాఫీ చేస్తున్నది? సామాన్యుల విషయంలో బ్యాంకులు ప్రవర్తించే తీరు ఇలానే ఉంటుందా? రైతులు, కిరాణా వ్యాపారస్తులు, చిన్న పారిశ్రామికవేత్తలు తాము చెల్లించాల్సిన వాయిదాలు (కిస్తీలు) సక్రమంగా లేకపోతే విరుచుకుపడే బ్యాంకులు బడాబాబుల పారుబకాయిల విషయంలో ఎందుకు నోరు మెదపలేక పోతున్నాయి ?
ప్రతి రోజూ కనీసం పది నుంచి ఇరవై వరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎస్ఎంఇ) మూసివేస్తున్నట్టు లేదా వేలం వేస్తున్న ప్రకటనలు హిందూ పత్రికలో కనిపిస్తాయి. ఒక్క హిందూ దినపత్రిక దక్షిణ భారత ఎడిషన్లో నెలకు వెయ్యికి పైగా పరిశ్రమలకు ఉరితాడు వేస్తున్నట్టు బ్యాంకుల ప్రకటనలు కనిపిస్తాయి. మొత్తం ఆంగ్ల పత్రికలలో ప్రకటనలు లెక్కిస్తే ఈ సంఖ్య 2000కి తక్కువేమీ కాదు.
కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమల (ఎస్ఎంఇ)కు తాము అందిస్తున్న సహకారం చాలా ఉందని, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫోటోతో పూర్తి పేజీ ప్రకటనలతో అప్పుడప్పుడు దేశంలోని అన్ని భాషలలో గొప్పగా చెబుతుంటుంది. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు (ఎస్ఎంఇ) తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు గొప్ప అవకాశం అంబుడ్స్మెన్ (మధ్యవర్తి) ఈ తరహా విధానమని, తక్షణ పరిష్కారానికి వినియోగించుకోవాలని రిజర్వు బ్యాంకు తరపున ప్రకటనలలో సారాంశంగా ఉంటుంది. పై ప్రకటనలలో వాగాడంబరం తప్ప చిన్న పరిశ్రమలు నెలకొల్పే వారికి ప్రోత్సాహకాలు ఏమీ లేవని తేలుతున్నది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఓ లెక్క ప్రకారం 60 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతకు గురైనట్టు సమాచారం. పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ కారణంగా ఈ సంఖ్య తీవ్రంగా పెరిగింది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వీరికి ఒరిగింది ఏమీ లేదు. స్వయంకృషితో పది మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చి పరిశ్రమలు స్థాపిస్తున్న వారికి ప్రోత్సాహం కరువవుతున్నది.
ముఖ్యంగా బ్యాంకులు పెట్టిన నిబంధనలు సామాన్యులు ఎవరూ తట్టుకుని పరిశ్రమలు కొనసాగించేలా లేవు. సాధారణమైన పరిశ్రమల పరిస్థితి ఇలా ఉండగా కార్పొరేట్ కంపెనీలకు అధిపతులుగా ఉన్న అదానీ, అంబానీ లాంటి వారికి లక్షల కోట్ల రూపాయల రుణాలను ఉత్తి పుణ్యంగా రద్దు చేస్తున్నారు. 2018లో 'ఇక్రా' అనే ఏజన్సీ తయారు చేసిన గణాంకాల ప్రకారం 70 ఖాతాలకు చెందిన రూ.3.80 లక్షల కోట్లు ఎన్పిఏలుగా (నిరర్ధక ఆస్తులు) మారిపోయాయని ఇందులో ప్రధానంగా విద్యుత్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, టెలికాం రంగాలకు చెందినవని పేర్కొన్నారు. ఈ 70 ఖాతాలలో 34 ఖాతాలు ఎలక్ట్రిసిటీ రంగానికి చెందినవని ఆ నివేదికలో ఉంది.
బ్యాంకులు తాము ఇచ్చిన రుణాలను ఆస్తులుగా పరిగణిస్తాయి. ఈ చెల్లింపులు కొంతకాలం ఆగిపోతే వాటిని నాన్ పెర్ఫామింగ్ అసెట్స్గా (నిరర్ధక ఆస్తులు) పేర్కొంటారు. భారత్లో ఉన్న నిబంధనల ప్రకారం రుణ చెల్లింపులు 90 రోజులపాటు పూర్తిగా కానీ, పాక్షికంగా గానీ జరపకపోతే ఆ రుణాలను ఎన్పిఏలుగా పరిగణిస్తారు.
మోడీ అధికారంలోకి వచ్చిన 2013-14 నుంచి 2022 డిసెంబర్ నాటికి ప్రభుత్వ, ప్రయివేటు విదేశీ బ్యాంకులకు రూ.12,09,606 కోట్ల నష్టం వాటిల్లిందని గణాంకాలు చెబుతున్నాయి. రుణాల ఎగవేతదారులకు మోడీ పాలన స్వర్గధామంలా తయారైంది. స్వతంత్ర భారత చరిత్రలో బ్యాంకులకు ఇంత పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిన దాఖలాలు లేవు. నష్టాల తీవ్రతను తగ్గించి చూపటానికి బ్యాంకుల విలీనం నాటకం ప్రారంభించారు. మోడీ హయాంలో బ్యాంకులకు బకాయిలు రూ.67.66 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకులవి రూ.54.33 లక్షల కోట్లు, మిగిలినవి ప్రయివేటు, విదేశీ బ్యాంకులవి. వీటిలో ఇప్పటికే రూ.12.10 లక్షల కోట్లను మొండి బకాయిలుగా ప్రకటించి రద్దు చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక గత తొమ్మిదేళ్లలో రూ.13.50 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2.09 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశారు.
గత ఐదేళ్లలో బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం రూ.10.57 లక్షల కోట్లకు చేరిందని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆర్బిఐ సమాధానం చెప్పింది. గత పదేళ్లలో బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిలు మొత్తం అక్షరాల రూ.15.5 లక్షల కోట్లు, గత మూడేళ్లలో బ్యాంకులకు బడాబాబులు ఎగవేసిన రుణాలు రూ.10.32 లక్షల కోట్లు. ఆర్బిఐ సమాచారం ప్రకారం గడిచిన మూడేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.3,66,380 కోట్ల రూపాయలను అంటే 62.45 శాతం రుణాలను రద్దు చేశాయి. ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేసిన వారి రుణాలను రద్దు చేస్తున్నారు. అయితే బాగుపడదామని, సమాజానికి ఏదో చేద్దామని ముందుకు వచ్చిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చిన రూ.14,91,177 కోట్ల లాభాలను కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో కార్పొరేట్ కంపెనీలు కట్టాల్సిన మొండి బకాయిల స్థానంలోకి బ్యాంకులు తరలించాయి. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, నిశాంత్ మోడీ, అమి మోడీ వంటి బడా గుజరాతీ పారిశ్రామికవేత్తలు పంజాబ్ నేషనల్ బ్యాంక్, దాని అనుబంధ సంస్థల నుంచి రూ.11,400 కోట్లు దోచుకున్నా ఎవరూ నోరు మెదపటం లేదు. వీరందరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితులే.
ప్రధానికి అతి సన్నిహితుడైన జతిన్ మెహతా 2014 లోనే కుటుంబంతో కలసి దేశం విడిచి పరారయ్యాడు. మెహతా యాజమాన్యం లోని విన్సన్ డైమండ్స్ సంస్థ బ్యాంకులకు రూ.7 వేల కోట్లు ఎగవేసింది. గుజరాత్కు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ సైతం రూ.8100 కోట్లు ఎగనామం పెట్టింది. వీరందరూ మోడీతో తమకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని బ్యాంకులకు టోకరా వేశారు. రిషి కమలేష్ యాజమాన్యంలోని ఎ.బి.జి షిప్ యార్డ్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ బ్యాంకుల నుంచి రూ.22,842 కోట్లు కొల్లగొట్టాయి. ఇలాంటి వ్యక్తులు సంస్థలు ఈ తొమ్మిదేళ్లలో అనేకం.
ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రంగరాజన్ వివరించిన ప్రకారం దేశంలో బడా బాబులు చెల్లించాల్సిన మొత్తం 28 లక్షల కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా మిగిలి పోయాయని చెప్పారు. ఇందులో పేరుగాంచిన వారు ఇలా (పట్టిక) ఉన్నారు.
వీరేగాక రూ.5 వేల కోట్లు, అంతకన్నా తక్కువ బకాయిలు ఉన్నవాళ్లు అనేక మంది ఉన్నారు. వీరంతా సొంత విమానాలతో దేశంలో దర్జాగా జీవిస్తున్నారు. ప్రజాధనంతో లావాదేవీలు జరిపే ఈ బ్యాంకులు బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులతో బంధం ఉన్న వారికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎలా ఇస్తున్నారు? వాటిని వసూళ్ళు చేయలేక, కనీసం వారిని ప్రశ్నించటం కూడా చేతకాక ప్రజాధనాన్ని ప్రభుత్వం ఎలా మాఫీ చేస్తున్నది? సామాన్యుల విషయంలో బ్యాంకులు ప్రవర్తించే తీరు ఇలానే ఉంటుందా? ముమ్మాటికి కాదు! చంద్రయాన్ లాంచ్ పాడ్ ఇంజనీరు క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణం చెల్లించటానికి జీతం లేక ఉద్యోగం వదలి 'ఇడ్లీ'లు అమ్మి రుణం తీరుస్తున్నారు. రైతులు, కిరాణా వ్యాపారస్తులు, చిన్న పారిశ్రామికవేత్తలు తాము చెల్లించాల్సిన వాయిదాలు (కిస్తీలు) సక్రమంగా లేకపోతే విరుచుకుపడే బ్యాంకులు బడాబాబుల పారుబకాయిల విషయంలో ఎందుకు నోరు మెదపలేకపోతున్నాయి? ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు ఎలా ఉందో చూద్దాం.
ఏదో ఉద్ధరిద్దామని చిన్నా, చితకా పరిశ్రమలు పెట్టి చేతులు కాల్చుకుని ఆ సంక్షోభ చట్రం నుంచి బయటపడలేక అల్లాడిపోతున్న జీవితాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. భర్త తీసుకున్న రుణం భర్త కాలం అయిన తర్వాత భార్య చెల్లించలేకపోతే బ్యాంకులు పెడుతున్న ఇబ్బందులు, తాతముత్తాతలు తీసుకున్న రుణానికి మనవళ్లు, వారి ముని మనవళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ మానసిక క్షోభకు గురవుతున్న ఘటనలు కోకొల్లలు. 'కాఫీ డే'కి అంతర్జాతీయ ప్రతిష్టను ఆర్జించి పెట్టిన వి.జి సిద్దార్ధ హెగ్డే తన బలవన్మరణానికి కారణం తీవ్రమైన ఒత్తిడి, బ్యూరోక్రసీ వేధింపులే కారణమని లేఖ రాసినా, ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు లేవు.
తిరుపతికి చెందిన ఒ.వి.రమణ అనే మధ్యతరహా పారిశ్రామికవేత్త ఫ్యాక్టరీని, ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇంటిని, ఆస్తులను పోగొట్టుకుని బ్యాంకులపై చేస్తున్న పోరాటం ఎంతో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగిస్తుంది. 2019లో మోడీ ప్రకటించిన ఎన్సిఎల్టి పథకం కూడా అందులో భాగమేనని, అంబుడ్స్మెన్ పథకం (అమితాబ్ ప్రకటన) వట్టి బూటకమని ఏ ఒక్కరి సమస్యను పరిష్కరించలేదని ఆయన అంటున్నారు. 2016వ సంవత్సరం నుంచి నేటి వరకూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని, చెయ్యని నేరానికి బ్యాంకులు సామాన్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తాను నిదర్శనమని తనలాంటి వాళ్లు రోజుకు కనీసం వెయ్యి మంది ఇబ్బందులకు గురవుతున్నారని, వీరి సమస్యలను పాలకులు పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అందరిలా తాను ఉండకూడదని, గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాంక్ అధికారుల తీరును నిశితంగా కోర్టులకు వివరించానని, వారిపై ఎదురు కేసులు పెట్టానని ప్రస్తుతం బ్యాంకు యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ అయిందని, ఇది దేశ చరిత్రలో మొదటి కేసుగా ఆయన అభివర్ణించారు. బాధితుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు బ్యాంకులు పాల్పడ్డాయని, తన లాంటి వాళ్లపై సాగుతున్న బ్యాంకుల దాష్టీకాలపై న్యాయం జరిగేంత వరకు తన పోరు సాగుతుందని ఒ.వి.రమణ అంటున్నారు.
ఇదీ మోడీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి.

/ వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు,
సెల్ : 9490098840 / కందారపు మురళి