
విజయవాడ: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని, అందులోను కుంభకోణం జరిగిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ''గత ఏడాది రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్ కొనుగోలు చేశారు. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారు. ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి రూ.2400 కోట్లు ఖర్చు చేశారు. టెండర్ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్గా ఏర్పడ్డాయి. నిధులు దారి మళ్లినట్లు ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలింది. విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగింది'' అని నాదెండ్ల ఆరోపించారు.
'విద్యార్థులకు ఆంగ్లం నేర్పేందుకు 32వేల ఫ్లాట్ ప్యానెల్స్ సరఫరా చేస్తామన్నారు. గతేడాది రూ.300 కోట్లతో ఇంటరాక్టివ్ ఫ్లాట్స్ ప్యానెల్ కొనుగోలు చేశారు. గతేడాది ఫ్లాట్ ప్యానెల్స్కు సంబంధించి నేటికీ డబ్బులు ఇవ్వలేదు. రూ.400 కోట్లతో ఫ్లాట్ ప్యానెల్స్ కొనుగోలు పేరిట మరో కుంభకోణం జరిగింది. పాఠశాల వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దారని గొప్పలు చెబుతున్నారు. పాఠశాల వ్యవస్థకు రూ.16వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. నాడు-నేడు కార్యక్రమానికి నాబార్డు నుంచి రూ.1800 కోట్లు రుణం తెచ్చారు. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.700 కోట్లు రుణం తీసుకొచ్చారు'' అని నాదెండ్ల తెలిపారు.