Nov 17,2023 16:02

బమ్రాస్‌పేట్‌: గత పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కోరారు. కొడంగల్‌ను దత్తత తీసుకుంటామని.. నీళ్లు తీసుకొస్తామని చెప్పిన నేతలు.. అలాగే చేశారా? అని నిలదీశారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని బమ్రాస్‌పేట్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.
'కాంగ్రెస్‌ హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. రోడ్లు వేశాం. ఈ పదేళ్లు బిఆర్‌ఎస్‌ పేదల కోసం ఏమీ చేయలేదు. ఇప్పుడొచ్చి కేసీఆర్‌ మళ్లీ మనల్ని ఓట్లు అడుగుతున్నారు. మందుపోయాలి, ఓటుకు రూ.10 వేలు ఇవ్వాలనేదే వారి ఆలోచన. రూ.లక్షల కోట్లు సంపాదించుకోవడమే బిఆర్‌ఎస్‌ నేతల లక్ష్యం. కేసీఆర్‌.. బంగారు తెలంగాణలో పేదలకు ఎంత బంగారం పంచారు? బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు.. ఉన్న బంగారాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ప్రజలు కష్టాలు అర్థం చేసుకున్నాం కాబట్టే తెలంగాణలో మరోసారి ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని నిర్ణయించాం. అందుకే 6 గ్యారంటీలు ప్రకటించాం'' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.