Oct 19,2022 11:00

చెనై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణకు ఏర్పాటు చేసిన మద్రాస్‌ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ ఆరుముఘస్వామి కమిషన్‌ కీలక విషయాలు వెల్లడించింది. 2017లో ఏర్పాటు చేసిన కమిషన్‌ ఆగస్టులో తన నివేదికను ప్రభుత్వానికి అందచేసింది. అసెంబ్లీలో మంగళవారం ఈ నివేదికను ప్రవేశపెట్టారు ఈ కేసులో జయలలిత సన్నిహితురాలు శశికళ, జయలలిత వైద్యులు కె.ఎస్‌. శివకుమార్‌, రాష్ట్ర మాజీ ఆరోగ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధకృష్ణన్‌లను దోషులుగా పేర్కొంది. అప్పటి రాష్ట్ర ప్రధానకార్యదర్శి రామ మోహన్‌రావు, ఆరోగ్య మంత్రి డాక్టర్‌ సి విజయభాస్కర్‌లనూ నేరస్తులుగా పేర్కొంది. ఈ కేసులో వీరందర్నీ మరోసారి విచారణ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.. జయలలిత కోసం ఇంగ్లండ్‌, అమెరికా నుంచి ఆహ్వానించిన వైద్యులు ఆమెకు ఆంజియో, సర్జరీ చేయాలని సూచించారని, అయితే ఆమెకు వైద్యం చేసిన అపోలో ఆసుపత్రి వైద్యులు వైవిసి రెడ్డి, బాబు అబ్రహం ఈ సూచనలను పక్కకు పెట్టారని కమిషన్‌ ఆరోపించింది. అప్పటి రాష్ట్ర ప్రధానకార్యదర్శి రామ మోహన్‌రావు సంతకం చేసిన వివిధ తేదీల్లోని 21 డాక్యుమెంట్లు నేర పూరితంగా ఉన్నాయని కమిషన్‌ గుర్తించింది. విదేశాల నుంచి వచ్చిన వైద్యులు ఆంజియో కోసం జయలలితను ఒప్పించినా, జయలలితను చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు జరిగినా అవి వాస్తవ రూపం దాల్చలేదని కమిషన్‌ వెల్లడించింది. వాస్తవాలు చెప్పడానికి తగిన అధికారం ఉన్నా.. అపోలో చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి తప్పుడు ప్రకటనలు ఇచ్చారని, 'తనకు ఉన్న పూర్తి అవగాహనతో అది నిజం కాదని తెలిసినా.. జయలలిత ఎప్పుడైనా డిశ్చార్చ్‌ కావచ్చు' అని ప్రకటించారని కమిషన్‌ చెప్పింది. జయలలిత హృదయ సమస్యలు, చికిత్స గురించి ప్రతాప్‌ సి రెడ్డి తరచూ నకిలీ ప్రకటనలు ఇస్తుండేవారని ఆరోపించింది. 'ఇది ప్రభుత్వం నిర్ణయించాల్సిన, దర్యాప్తు చేయవల్సిన అంశం' అని నివేదిక పేర్కొంది. ఆపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ 2016 డిసెంబరు 5న జయలలిత మరణించారు. ఆమె మరణానికి దారి తీసిన పరిస్థితులపై విచారణకు ఆరుముఘస్వామి విచారణ కమిషన్‌ను ఎఐఎడిఎంకె ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆగస్టు 27న ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కమిషన్‌ తన నివేదికను అందజేసింది. ఆరుముఘస్వామి కమిషన్‌కు సహాయంగా ఎయిర్సు మెడికల్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. అపోలో ఇచ్చిన మెడికల్‌ రిపోర్టులపై ఈ ప్యానెల్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆరుముఘస్వామి కమిషన్‌ను జయలలితకు చెందిన ఎఐఎడిఎంకె పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకె జయలలిత మరణంపై విచారణ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది.