న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా 18 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ కంపెనీ ఒక్క భారత్లోనే వెయ్యిమందికిపైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అయితే తొలగించిన ఉద్యోగులకు ఐదు నెలల వేతనం, ఆరోగ్య ప్రయోజనాలతోపాటు కంపెనీ నుంచి అవసరమైన సాయం అందిస్తామని ఆ కంపెనీ సిఇఓ ఆండీ జస్సీ ప్రకటించారు. ఇక వేటుకు గురైన ఉద్యోగులందరి పరిహార ప్యాకేజీల విలువ ఏకంగా రూ. 5200 కోట్లుగా ఉంటుందని సమాచారం. ఉద్యోగులకు పరిహారం చెల్లించేందుకు, తాజాగా కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు అమెజాన్ తన కార్యాలయాల్లో కొన్నింటిని అమ్మడానికి సిద్ధమైందని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ తెలిపింది. లేఆఫ్స్ ప్రకటనకు ముందు.. 16 నెలల కిందటే కాలిఫోర్నియాలోని తన కార్యాలయాన్ని విక్రయించేందుకు అమెజాన్ సిద్ధమైందని బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది.










