Oct 28,2022 06:59

పశువులున్న ప్రతీ కుటుంబంలో వాటి పోషణ కోసం ఒక మహిళ రోజుకు కనీసం రెండు గంటలు వెచ్చించిందని కర్నాటక లోని ఫౌండేషన్‌ ఫర్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌ నిర్వహించిన గ్రామ సర్వేలు తెలియజేస్తున్నాయి. పశువుల సంఖ్య, పశువుల జాతి, కాలం ఆధారంగా (కొన్ని కాలాల్లో మేత అంత తేలికగా అందుబాటులో ఉండదు కాబట్టి పశువుల్ని మేపడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది) ఏడు నుండి ఎనిమిది గంటల వరకు
సమయం పడుతుంది.


భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో పశుపోషణ రంగం ఒకటి. 2018-19 సంవత్సరంలో వ్యవసాయ స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి)లో 28 శాతం, జాతీయ ఆదాయంలో 5 శాతం వాటా ఈ రంగం నుండే వచ్చింది. గడచిన ఆరు సంవత్సరాల కాలంలో పశుపోషణ రంగం 7.9 శాతం వృద్ధి (స్థిరమైన ధరలతో) చెందగా, పంటల సాగు 2 శాతం వృద్ధి చెందింది. గ్రామీణ కుటుంబాలలో పశువుల పెంపకంలో మహిళలే కీలక పాత్ర పోషిస్తారని క్షేత్రస్థాయి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి పశువుల పెంపకం, వృద్ధి, పశు సంరక్షణ సేవలు, పశురుణాలు...లాంటి పలు అంశాలలో మహిళలను చేర్చి, వారి పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉంది.
            గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మహిళా శ్రామికులు (72 శాతం) వ్యవసాయ కార్యకలాపాలలో నిమగం అవుతున్నారని గుర్తించారు. పాల సహకార సంఘాల్లో, ముఖ్యంగా పాల మార్కెటింగ్‌లో భాగస్వాములయ్యే మహిళలను మినహాయిస్తే... పశుపెంపక ఆధారిత ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర విస్తృతంగా ఉన్న విషయం పెద్దగా తెలియదు. వారి పాత్ర అసలు చర్చకే రాదు. 2015-16 సంవత్సరంలో పాల సహకార సంఘాలలో యాభై లక్షల మహిళా సభ్యులు ఉండేవారు. తరువాత 2020-21 సంవత్సరానికి ఆ సంఖ్య 54 లక్షలకు పెరిగింది. భారతదేశంలో మహిళల పాల సహకార సంఘాల సంఖ్య 2012లో 18,954 ఉంటే, అది 2015-16 నాటికి 32,092కు పెరిగింది.
 

                                                                    వివరాల సేకరణలో సమస్యలు

పశుపోషణలో మహిళల పనిని ఖచ్చితంగా నమోదు చేయడంలో సాంప్రదాయ కార్మిక శక్తి సర్వేలు విఫలమవుతున్నాయి. వివరాల సేకరణలో రెండు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి, రోజు మొత్తంలో తక్కువ సమయంలో అప్పుడప్పుడూ చేసే పనితో పాటు ఇంటి పరిధిలోనే చేసే పని స్వభావం. రెండు, మహిళల స్వంత బాధ్యతలు. ఒక పేద మహిళా రైతు తన రోజువారీ పనిని, పశువుల కొట్టంలో ఆవు పేడను పది నిమిషాల (5.15 నుండి 5.25 వరకు) పాటు ఎత్తివేయడంతో ప్రారంభించింది. కొంతసేపు వంట పని చూసుకున్నాక, 25 నిమిషాల పాటు ఆవుల పాలు తీసి, అరగంటలో పశువుల కొట్టాన్ని ఊడ్చి శుభ్రం చేసింది. ఇతర ఇంటి పనులన్నీ పూర్తయిన తర్వాత నిర్మాణ రంగానికి సంబంధించిన పని ప్రాంతానికి వెళ్ళింది. తనతో పాటు రెండు ఆవుల్ని కూడా తీసుకెళ్ళి, అవి మేత మేసేందుకు వీలుగా పని ప్రాంతం దగ్గర కట్టేసింది. సాయంకాలం వాటిని తోలుకుని ఇంటికి వచ్చింది. పాలు పితికి వాటికి మేత వేసింది. ఈ పని చేయడానికి సుమారు 40 నిమిషాలు పట్టింది. రాత్రి భోజనం చేశాక ఆ రోజులో చివరిసారిగా పశువులకు మేత వేసింది. ఆ మహిళకు పశుపోషణకు సంబంధించిన పనులు చేయడానికి సుమారు మూడున్నర గంటల సమయం పట్టింది. ఈ పనులన్నీ ఇంటి పనులతో కలిపే చేసింది. అందువలన 'పశువుల పెంపకాన్ని బహుశా ఆ మహిళ ఒక ఆర్థిక కార్యకలాపమని చెప్పకపోవచ్చు' అని కర్నాటక లోని ఒక గ్రామంలో జరిగిన ''ఎ టైమ్‌ యూజ్‌ సర్వే'' నివేదిక తెలిపింది. అధికారిక గణాంకాలలో చోటుచేసుకుంటున్న ఈ దోషాన్ని సరిచేయాలంటే, పనిలో పెరిగిన వారి భాగస్వామ్యాన్ని పెంచి లెక్కించడమే ఏకైక మార్గం. మరో మాటలో చెప్పాలంటే... తాము ఇంటి పనులు చేస్తున్నమని చెప్పే, సంవత్సరంలో ఎక్కువ భాగం పెరటి తోట పని, కుటుంబ పాడి, కోళ్ల పెంపకం వంటి పనులు చేసే మహిళలను కూడా చేర్చాలి.
 

                                                                          తక్కువగా అంచనా

స్పష్టంగా చెప్పాలంటే, ఎంప్లారుమెంట్‌ అండ్‌ అన్‌ఎంప్లారుమెంట్‌ సర్వే 2011-12 ప్రకారం పశువుల పెంపకంలో కోటి 20 లక్షల మంది గ్రామీణ మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. పెంచిన ఆలోచన ప్రకారం సుమారు 4 కోట్ల 90 లక్షల మంది గ్రామీణ మహిళలు పశువుల పెంపకంలో నిమగమయ్యారని మేం అంచనా వేశాం. ఒక్కమాటలో చెప్పాలంటే వాస్తవానికి పశుపోషణ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో నిమగమైన మహిళలు...అధికారిక అంచనాల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నారు. వారు కూడా గ్రామీణ జనాభాలో గణనీయమైన భాగంగా ఉన్నారు. 2019లో భారతదేశంలో మొదటిసారి జరిగిన 'నేషనల్‌ టైమ్‌ యూజ్‌ సర్వే' గణాంకాలు దీనిని ధృవపరుస్తున్నాయి. 24 గంటల్లో చేసిన అన్ని కార్యకలాపాలను (వంట పని లేదా వ్యవసాయ పనులు) నమోదు చేసినప్పుడు, 11 శాతం మంది గ్రామీణ మహిళలు (4 కోట్ల 80 లక్షల మంది మహిళలు) పశువుల పెంపకం చేపడుతున్నారని తెలుస్తోంది.
             పశువులున్న ప్రతీ కుటుంబంలో వాటి పోషణ కోసం ఒక మహిళ రోజుకు కనీసం రెండు గంటలు వెచ్చించిందని కర్నాటక లోని ఫౌండేషన్‌ ఫర్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌ నిర్వహించిన గ్రామ సర్వేలు తెలియజేస్తున్నాయి. పశువుల సంఖ్య, పశువుల జాతి, కాలం ఆధారంగా (కొన్ని కాలాల్లో మేత అంత తేలికగా అందుబాటులో ఉండదు కాబట్టి పశువుల్ని మేపడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది) ఏడు నుండి ఎనిమిది గంటల వరకు సమయం పడుతుంది. పశువుల పెంపకం అనేది గ్రామంలోని వయసు మళ్లిన, అంతంత మాత్రంగా చదువుకున్న మహిళల వృత్తిగా మారింది.
          ద నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ పాలసీ(ఎన్‌ఎస్‌పి)-2013 పశువుల ఉత్పత్తిని, ఉత్పాదకతను దీర్ఘకాలం పాటు కొనసాగించే లక్ష్యాన్ని చేపట్టింది. ఈ పశుపోషణ రంగంలో చేసే శ్రమలో సుమారు 70 శాతం శ్రమ మహిళలదే. మహిళల సాధికారతను సాధించడం ఈ పాలసీ లక్ష్యాలలో ఒకటి. పశువుల మేతను అందుబాటులో ఉంచడం, సేవలను విస్తరించడం, పశుపోషణ రైతులకు మెరుగైన రుణ సౌకర్యాలపై దృష్టి సారించి పశుపోషణ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం 2014-15లో 'ద నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌' (ఎన్‌ఎల్‌ఎమ్‌)ను ప్రారంభించారు. అయినప్పటికీ ఇది మహిళా పశుపోషణ రైతులకు ప్రత్యేకించి ఏ విధమైన పథకాలు లేదా కార్యక్రమాలను ప్రతిపాదించదు. పైగా మహిళల కోసం చేపట్టే కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులను కేటాయిస్తుందని ఈ పాలసీ చెప్తుంది. ముప్పై శాతం కోటాలో ఏవిధమైన హేతుబద్ధత లేదు.
 

                                                                            ప్రధాన సమస్యలు

పాలకులకు మహిళా పశుపోషకులు కనిపించడం లేదనేది ఇక్కడ స్పష్టంగా కనిపించే సమస్య. ఎటువంటి వివక్ష లేకుండా పశు పోషణ చేపట్టే స్త్రీ, పురుషుల వివరాలు లేకపోవడం మరో సమస్య. ఇటీవల ఉపాధి సర్వేలు చేపట్టిన ''ద పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే'' లాంటివి ప్రాథమికంగా ఇంటి పనుల్లో నిమగమైన వారి నిర్దిష్ట కార్యకలాపాలను సేకరించడంలో విఫలమైనాయి. కాబట్టి పశుపోషణ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో మహిళల శ్రమను తక్కువగా లెక్కిస్తున్నారు.
              పశుపోషణ చేపట్టే మహిళలు అదనంగా చేసే పనుల వివరాలు కూడా అందుబాటులో లేవు. అధికారిక నివేదికల ప్రకారం... 2021లో దేశ వ్యాప్తంగా పశుపోషణ చేస్తున్న 80 వేల మందికి శిక్షణ ఇచ్చారు. కానీ వీరిలో మహిళలు ఎంత మంది అనేది మాకు అవగాహన లేదు.
         బ్యాంకులకు ఆస్తులను తాకట్టు పెట్టకుండా పేద కుటుం బంలోని మహిళలు పశువులను కొనడానికి అవసరమైన రుణాలు పొందడం కష్టంగా తయారైందని మా గ్రామీణ సర్వేలు తేల్చాయి. 2020-22 మధ్య కాలంలో కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం కింద పశువుల పెంపకందార్లకు సుమారు 15 లక్షల కొత్త కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను సమకూర్చారు. వారిలో మహిళలు ఎంతమందనే సమాచారం లేదు.
          మా గ్రామీణ సర్వేల ప్రకారం... పశువులు ఎదకు వచ్చినప్పుడు...నిర్దిష్టమైన పనులను పురుషులే చేపట్టారు. మహిళా రైతులకు సాంకేతిక పరిజ్ఞానం లేదు.
         మహిళలకు పాల కేంద్రాల నిర్మాణం, వాటి విధులు తెలియదనీ, మహిళలు మాత్రమే సభ్యులుగా ఉన్న పాల సహకార సంఘాల్లో కూడా పురుషులే నిర్ణయాలు తీసుకుంటారని మా గ్రామీణ అధ్యయనాలు తెలియజేశాయి. పేద షెడ్యూల్డ్‌ కులాల కుటుంబాలకు చెందిన లేదా భూమి లేని మహిళల అభిప్రాయాలు పెద్దగా వెల్లడి కాలేదు.
          పశుపోషణ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మహిళల శ్రమ చాలా కీలకమైనది. ఈ రంగ అభివృద్ధిలో, నిర్ణయాధికారంలో... ప్రతీ దశలోను మహిళలను చేర్చాలి. పశుపోషణ చేపడుతున్న మహిళలు అధికారిక గణాంకాలలో లేకపోవడంతో...నేడు వారి శ్రమ కూడా లెక్కల్లో లేకుండా పోయింది. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది.

/ మధురా స్వామినాథన్‌ ప్రొఫెసర్‌. బెంగుళూరు లోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎకనామిక్‌ ఎనాలిసిస్‌ యూనిట్‌ హెడ్‌. విజయాంబ ఆ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో /
('ద హిందూ' సౌజన్యంతో)
మధురా స్వామినాథన్‌

మధురా స్వామినాథన్‌
 

ఆర్‌. విజయాంబ

ఆర్‌. విజయాంబ