Jan 27,2023 10:03
  • రాత్రి 7.00గం.ల నుంచి స్టార్‌స్పోర్స్‌లో

రాంచీ : వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా ఇక టి20 సిరీస్‌పై దృష్టి సారిం చింది. సీనియర్‌ బ్యాటర్స్‌ రోహిత్‌ శర్మ, కోహ్లితో పాటు పేస్‌ బౌలర్లు సిరాజ్‌, షమీ, శార్దూల్‌ కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో యువ పేసర్లు ఆర్ష్‌దీప్‌, శివమ్‌ మావి, ఉమ్రన్‌పైనే టీమిండియా ఆశలున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత టి20 జట్టులో చోటు దక్కించుకున్న పృథ్వీ షా తుది జట్టులో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరు తున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన శుభ్‌మన్‌ గిల్‌ మరో ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయం. మూడు వన్డేల సిరీస్‌లో ఓ డబుల్‌ సెంచరీ, మరో సెంచరీ చేశాడు. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ ఫార్మాట్‌లో ఐసిసి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండడం మనకూ కలిసిరానుంది. శ్రీలంకతో జరిగిన మూడు టి20 సిరీస్‌కు టీమిండియా జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఇప్పటివరకు జరిగిన టి20 సిరీస్‌లలో భారత్‌ 10 గెలిచి మరో 2 సిరీస్‌ను డ్రా చేసుకొంది. 2019 లో ఆస్ట్రేలియా చేతిలో చివరి సారిగా టీమిండి యా ఈ ఫార్మాట్‌లో సిరీస్‌ను చేజార్చుకుంది. ఇక న్యూజిలాండ్‌పై టీమిండియాకు అద్భుత మైన ట్రాక్‌ రికార్డును కలిగి ఉండడం మనకు అనుకూలించ నుంది. ఇక న్యూజిలాండ్‌ జట్టు విషయానికొస్తే.. ఈ ఫార్మాట్‌లోనైనా బోణీ కొట్టాలని చూస్తోంది. కెప్టెన్‌ మిఛెల్‌ సాంట్నర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ బెన్‌ లిస్టర్‌ అరంగేట్రం చేయనున్నాడు.
 

                                                                        గైక్వాడ్‌కు గాయం

టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌(25) మణికట్టుకు గాయమైంది. హైదరాబాద్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌ సందర్భంగా మహారాష్ట్ర తరఫున ఆడుతున్న గైక్వాడ్‌ మణి కట్టుకు గాయమైంది. దీంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకుంటున్నాడు. అతడి గాయంపై బిసిసిఐ ఇప్పటికి ఎలాంటి ప్రకటన చేయలేదు. గాయం తగ్గకపోతే న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్‌కు దూరమైనట్లే.

ఇండియా జట్టు : హార్దిక్‌(కెప్టెన్‌), సూర్యకుమార్‌(వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌, శుభ్‌మన్‌, దీపక్‌ హుడా, త్రిపాఠి, జితేశ్‌ శర్మ, సుందర్‌, కుల్దీప్‌, చాహల్‌, ఆర్ష్‌దీప్‌, ఉమ్రన్‌, శివమ్‌ మావి, పృథ్వీ షా, ముఖేష్‌ కుమార్‌, గైక్వాడ్‌.